కర్ణాటక: ఎమ్మెల్యేల గైరాజర్ సాధ్యమేనా, అసెంబ్లీలో బలనిరూపణకు బిజెపి ప్లాన్ ఇదే
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిజెపి నేత యడ్యూరప్ప గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 15 రోజుల్లోపుగా యడ్యూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సింది. అయితే మెజారీటికి 8 మంది ఎమ్బెల్యేల దూరంలో ఉన్న బిజెపి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొనేందుకు అన్ని రకాల వ్యూహాలను అనుసరిస్తోంది.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మే 12న, 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇంకా రెండు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ రెండు స్థానాలకు మే చివరి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు గురువారం నాడు విధానసభ ఆవరణలో ఉన్న మహత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. అయితే అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో బిజెపి తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రస్తుతం బిజెపి నేతల ముందున్న అసలైన సవాల్.
కాంగ్రెస్ లింగాయత్ ఎమ్మెల్యేలపై బిజెపి ఆశలు
అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొనేందుకుగాను బిజెపి వ్యూహలను రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో బిఎస్ యడ్యూరప్ప సమావేశమయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలు కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించాయి.కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
బలనిరూపణ రోజున ఎమ్మెల్యేల గైరాజరు
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిఎస్ యడ్యూరప్ప 15 రోజుల్లోపుగా బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బలనిరూపణలో విజయం సాధించేందుకు బిజెపి అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. బలనిరూపణ జరిగే రోజున సుమారు 15 మంది ఎమ్మెల్యేలను (కాంగ్రెస్, జెడి(ఎస్)కు చెందిన )సభకు రాకుండా గైరాజరయ్యేలా చేయాలని బిజెపి ప్లాన్ గా కన్పిస్తోంది. అదే జరిగితే బలనిరూపణ జరిగిన రోజున ఎంత మంది ఎక్కువ ఎమ్మెల్యేలు గైరాజరైతే బల నిరూపణ చేసుకొనేందుకు యడ్యూరప్పకు తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది.
కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేల రాజీనామాస్త్రం
బలనిరూపణ జరిగే రోజు లోపుగానే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమికి చెందిన నాలుగు, లేదా ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామాలను చేయించాలని బిజెపి ప్లాన్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. ఎన్నికలు జరిగి వారం రోజులు కూడ కాకముందే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళడానికి ఎమ్మెల్యేలు సాహసించరు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేలను ఒప్పించడం బిజెపి నాయకత్వానికి కొంత ఇబ్బందులే. అయితే చివరి అస్త్రంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు.
208కు సభ్యుల సంఖ్య తగ్గిస్తే యడ్యూరప్పకు సులభం
కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు గాను బిజెపి అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సభలో సభ్యుల సంఖ్యను 208కు తగ్గించగలిగితే అసెంబ్లీని బలాన్ని సులభంగా నిరూపించుకొనే అవకాశం దక్కనుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే 20 మందికి పైగా సభ్యుల సంఖ్యను తగ్గించుకోవడం అంత సులభం కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.