బాంబే బ్లడ్ గ్రూప్: డాకా వ్యక్తిని కాపాడిన ముంబైవాసులు, ఏమిటిది?
ముంబై: హీరో గోపీచంద్ 'ఒక్కడున్నాడు' సినిమాలో బాంబే బ్లడ్ గ్రూప్ సినిమా ప్రస్తావన గురించి చూశాం. బాంబే బ్లడ్ గ్రూప్ చాలా చాలా అరుదుగా దొరికే గ్రూప్. తాజాగా, బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం దానం ఇవ్వడం ద్వారా మానవత్వానికి సరిహద్దులు లేవని నిరూపించారు నలుగురు ముంబైవాసులు.
ఢాకాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బంగ్లాదేశ్ యువకుడికి గాయాలయ్యాయి. అతను తీవ్రంగా గాయపడటంతో వీరు తమ రక్తాన్ని ఇచ్చి ప్రాణదానం చేశారు. ఈ ప్రమాదంలో 25 ఏళ్ల మహ్మద్ కమ్రుజమాన్ గాయపడ్డాడు.
అతనిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే, అతడిది అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది. దాతల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. బ్లడ్ బ్యాంకుల్లోను ఈ గ్రూపు రక్తం దొరకలేదు.
కమ్రుజమాన్ ప్రాణాల పైన కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వారు నాలుగు వందల మంది కంటే తక్కువగానే ఉన్నారని, రక్త దాతలు ముంబైలో దొరుకుతారని థింక్ ఫౌండేషన్ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.
బాధితుడి సహచరుడు ఎస్కే తుహినూర్ అలాం ముంబై చేరుకొని రక్తదాతలను సంప్రదించాడు. స్వప్న సావంత్, కృష్ణానంద్ కోరి, మోహుల్ భేలేకర్, ప్రవీణ్ షిండేలు రక్తం ఇచ్చారు. దీనిని భద్రంగా ఢాకా తీసుకు వెళ్లారు. కమ్రుజమాన్ కోలుకున్నారు.
కాగా, బాంబే బ్లడ్ గ్రూప్ అరుదైన ఏబీవో గ్రూప్. ఈ రక్తం ముంబై వారిలో తొలుత గుర్తించారు. దీంతో ఈ రక్తం గ్రూపుకు ఆ పేరు వచ్చింది. ఈ బ్లడ్ గ్రూప్ను మొదటిసారి పారెల్స్ కేఈఎం ఆసుపత్రిలో ఓ పేషెంట్కు ఉన్నట్లు గుర్తించారు. ఈ బ్లడ్ గ్రూప్ రక్తం కకాసియా, జపాన్లలోని వ్యక్తులలో కూడా కనిపిస్తుంది. ఈ బ్లడ్ గ్రూప్ రక్తం కలిగిన వారు ఇతర బ్లడ్ గ్రూప్ వారికి రక్తం ఇవ్వకూడదు.