ధోని సెకండ్ ఇన్నింగ్స్: ఆ పొలిటికల్ పార్టీ నుంచి భారీ ఆఫర్, గతంలోనే డీల్..?
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా..? అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాక జార్ఖండ్ డైనమైట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడా..? ఒక వేళ ధోనీ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరతారు.. అందుకు ఏ పార్టీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతోంది... ఇవన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Recommended Video
ధోనీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా..?
టీమిండియా క్రికెటర్ భారత జట్టు మాజీ కెప్టెన్ ధోనీ స్వాంతంత్ర్య దినోత్సవం రోజున సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెబుతూ యావత్ క్రీడాలోకానికి షాక్ ఇచ్చారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగానే చాలామంది క్రికెట్ అభిమానులు బాధపడ్డారు. ధోనీ ఆటను ఇకపై చూడలేమేమో అని ఆవేదన చెందారు. జార్ఖండ్ డైనమైట్ కొట్టే హెలికాఫ్టర్ షాట్లు ఇక అంతర్జాతీయ క్రికెట్లో కనిపించవని తెలిసి కంటతడి పెట్టినవాళ్లు కూడా లేకపోలేదు. అయితే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాక ఫ్యాన్స్ తమకు తోచినట్లుగా వారి అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. అభిమానులది ఒక బాధ అయితే రాజకీయ నాయకులది మరో బాధ. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే పొలిటికల్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ధోనీ తన సెకండ్ ఇన్నింగ్స్లో పొలిటికల్ లీడర్గా ఎంట్రీ ఇస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ధోనీకి బీజేపీ బంపరాఫర్..?
జార్ఖండ్ డైనమైట్ ఒకవేళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తాను బీజేపీ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ బీజేపీ నాయకుడు ధోనీకి బంపరాఫర్ ఇచ్చారట. లోక్సభ ఎంపీగా పోటీచేసి పార్లమెంటులో కనిపించాలని చెప్పారట. ఇక బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యన్ స్వామి కూడా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ధోనీ కేవలం అంతర్జాతీయ క్రికెట్కు మాత్రమే గుడ్బై చెప్పారని మిగతా రంగాల నుంచి కాదంటూ స్వామి ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే బలమైన క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి ఎన్నో సవాళ్లను అవలీలగా ఎదుర్కొని జట్టును విజయం వైపు నడిపిన ధోనీ... ప్రజాజీవితంలోకి రావాలని రాజకీయాల్లో కూడా విజయం సాధిస్తారనే అభిప్రాయాన్ని స్వామి వ్యక్తం చేశారు. 2024లో లోక్సభకు పోటీ చేయాలని సలహా ఇచ్చారు.
గతంలో ధోనీని కలిసిన అమిత్ షా
ఇదిలా ఉంటే ధోనీని తమ పార్టీలోకి స్వాగతించి జార్ఖండ్ నాయకత్వం అప్పగించాలని బీజేపీ గతంలోనే ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అంతకుముందు ధోనీ సోదరుడు నరేంద్ర సింగ్ ధోనీ 2009లో బీజేపీలో చేరి ఆ తర్వాత 2013లో సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఇక జార్ఖండ్ డైనమైట్కు బీజేపీ సీనియర్ నేత లోక్సభ ఆఫర్ ఇవ్వడంతో తిరిగి మహేంద్రుడి రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా నాడు అమిత్ షా చేసిన సంపర్క్ ఫర్ సమర్థన్ యాత్ర సందర్భంగా ధోనీని కలవడం జరిగింది. అప్పట్లో ఇది పెద్ద వార్తగా నిలిచింది. అంతేకాదు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగానే స్పందించిన పొలిటికల్ లీడర్స్లో ముందువరసలో నిలిచారు అమిత్ షా. ఇదిలా ఉంటే రిటైర్ అయిన తర్వాత ధోనీ ఇప్పటి వరకు తాను నెక్ట్స్ ఏం చేయాలనుకుంటున్నారో అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గౌతం గంభీర్ కూడా క్రికెట్కు గుడ్ బై చెప్పగానే బీజేపీ తీర్థం పుచ్చుకుని 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీచేసి గెలిచారు.