జల్లికట్టు-వీరోచిత క్రీడ: ఇలా మలుపులు తిరిగింది!
సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పైన నిషేధాన్ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వానికి గురువారం చుక్కెదురయింది.
చెన్నై: సంక్రాంతి పర్వదినం సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పైన నిషేధాన్ని ఎత్తివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వానికి గురువారం చుక్కెదురయింది. ఆటపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. దీంతో రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు పొంగల్ సమయంలో ప్రధానంగా జల్లికట్టు పేరు పదేపదే వినిపిస్తోంది. దీనిని ఆనవాయితీగా నిర్వహించే మాట్టు పొంగల్ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్వహణకు చట్టపరంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
జల్లికట్టులో కోడెలను అణచే ప్రయత్నంలో వాటి ప్రతిఘటనలో పలువురు తీవ్రంగా గాయపడుతుంటారు. ప్రాణాల మీదకు వచ్చే క్రీడ అయినప్పటికీ తమిళులు దీని కోసం పట్టుబడుతున్నారు. తమిళుల సంప్రదాయానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచేది కావడమే ఇందుకు ముఖ్య కారణం. 15న మాట్టుపొంగల్ (పశువుల పండుగ)ను పురస్కరించుకుని జల్లికట్టు క్రీడ నిర్వహించేందుకు అందరూ అనుమతి కోరుతున్నారు.
వీరోచిత క్రీడ
జల్లికట్టు అంటే రంకెలు వేస్తూ దూసుకెళ్లే కోడెలను వీరోచితంగా అణచివేసే క్రీడ. ఇందులో గెలిచే వీరులకు కానుకగా ఇచ్చేందుకు యాభై ఏళ్ల కిందట ఓ గుడ్డసంచిలో ఉంచిన 'సల్లికాసు' అనే భారతీయ నాణేలను కోడెల కొమ్ముకు కట్టేవారు. ఎద్దును లొంగదీసుకున్న ధీరునికే దాని కొమ్ముకు కట్టిన సల్లికాసుల మూట దక్కుతుంది.
ఎద్దులకు తర్ఫీదు
అయితే అంత సులభంగా ఈ గుడ్డ సంచిని ఎవరూ తీసుకోకుండా ఉండేందుకు ఎద్దులకు ముందు నుంచే ప్రతిఘటించడంపై తర్ఫీదునిచ్చేవారు. ఈ క్రీడనే క్రమంగా జల్లికట్టుగా మారిందని అంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో మంజు విరట్టు, వేలి మంజు విరట్టు, వడం మంజు విరట్టు అనే పేర్లతో పిలుస్తున్నారు.
తరుముకు వెళ్లడం..
ఓ మైదానంలో స్వేచ్ఛగా వదిలిపెట్టిన కోడెలను పలువురు యువకులు తరుముకు వెళ్లడం వేలి మంజు విరుట్టు కాగా, కోడె మెడకు కట్టిన తాళ్లతో రెండు వైపులా దానిని పలువురు లాగిపట్టుకోగా దాని కొమ్ముకు ఉన్న బహుమతి నగదును పొందడానికి కొందరు ప్రయత్నించడం వడం మంజువిరట్టుగా పిలుస్తున్నారు.
పలు జిల్లాల్లో..
తమిళనాడులోని మదురై జిల్లా అలంగానల్లూర్, పాలమేడు, అవనియాపురం, పెరైయూర్, శివగంగై జిల్లాలోని శిరావయల్, సింగంపుణరి, పుదూర్, అరళిపారై, పుదుకోట్టై జిల్లాలోని నార్దామలై ప్రాంతాలతో పాటు తిరుచ్చి, తేని వంటి దక్షిణాది జిల్లాల్లోనూ జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహించేవారు. అయితే అలంగానల్లూర్లో జరిగే జల్లికట్టు క్రీడ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. ఏటా ఇక్కడ జరిగే క్రీడను తిలకించడానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి యువకులతో పాటు విదేశీయులు కూడా తరలి వస్తుంటారు.
సుప్రీం కోర్టులో నాడు వ్యాజ్యం
ఇదిలా ఉండగా, జల్లికట్టు క్రీడలో కోడెలను హింసిస్తున్నట్లు ఆరోపిస్తూ 2008 జనవరిలో పొంగల్ పండగకు కొన్ని రోజుల ముందు జంతుసంక్షేమ మండలి ద్వారా మేనకా గాంధీ వ్యాజ్యం వేయగా జల్లికట్టు క్రీడను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది. అంతకు ముందే బ్లూక్రాస్, పెటా తదితర సంస్థలు సైతం సర్వోన్నత న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి.
నిబంధనలతో..
కొన్ని నిబంధనలతో జల్లికట్టు నిర్వహణకు అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వం కోరగా న్యాయస్థానం సూచనల మేరకు 'తమిళనాడు జల్లికట్టు రెగ్యులేషన్ యాక్ట్ 2009'ని రూపొందించింది. ఇది జల్లికట్టు నిర్వాహకులు అనుసరించాల్సిన నిబంధనలను సూచిస్తోంది.
మళ్లీ మొదటికి..
అయితే, 2011 జులైలో అప్పటి కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జైరాం రమేష్ జారీ చేసిన ఆదేశాల కారణంగా.. జల్లికట్టు నిషేధం మరోసారి తెరపైకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉంచి గారడీ చూపించకూడదనే జాబితాలో ఎద్దును సైతం చేర్చారు. ఆ తర్వాత నిబంధల మేరకు నిర్వహించినా.. ఎద్దులను హింసిస్తున్నారనే కారణంతో మళ్లీ పిటిషన్ దాఖలైంది. దీంతో 2014లో నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.