భూ ఉపరితలానికి 300 కి.మీ ఎత్తు: స్పేస్ జామ్ ను క్లియర్ చేసే ఆయుధం!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ జామ్ అనేది మనం రోజూ వినే పదం. మరి స్పేస్ జామ్ అంటే? ఇస్రో, నాసా సహా వివిధ దేశాలు ప్రయోగించిన ఉపగ్రహాలు కాలం తీరిపోయి, భూ కక్ష్యలోకి పరిభ్రమిస్తుంటాయి. ఇప్పటికే అలాంటి శక్తి విహీనమైన ఉపగ్రహాలు కనీసం అంటే 4000 వరకు ఉంటాయి. అలాంటి ఉపగ్రహాల వల్ల తరచూ స్పేస్ జామ్ తలెత్తుతుంటుంది. కొత్త ఉపగ్రహాలను భూ పరిభ్రమణ కక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే.. తరచూ ఇలాంటి శాటిలైట్ల నుంచి ఇబ్బందులు తలెత్తుతుంటాయి.
రోడ్డు మీద వాహనాలు స్తంభించిపోతే.. దాన్ని క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అంతరిక్షంలో ఎవరు ఉంటారు? అందుకే- విచ్చలవిడిగా కాలం చెల్లిన శాటిలైట్లు అటు, ఇటూ తిరుగాడుతుంటాయి. వాటిని పేల్చేయడానికి భారత్ సరికొత్త ఆయుధాన్ని రూపొందించింది. అదే యాంటీ-శాటిలైట్ వెపన్. సింపుల్ గా ఏశాట్ అని పిలవొచ్చు. ఈ తరహా శాటిలైట్ ను కనుగొన్న నాలుగో దేశం మనది. మనకంటే ముందు అమెరికా, ఒకప్పటి సోవియట్ రష్యా, చైనా ఈ ఘనతను సాధించాయి. ప్రస్తుతం మనదేశం వాటి సరసన చేరింది..సగర్వంగా!
లియో..లో ఎర్త్ ఆర్బిట్. క్షుణ్నంగా చెప్పాలంటే- భూ ఉపరితలంపై నుంచి అతి తక్కువ ఎత్తులో ఉండే కక్ష్య. భూ ఉపరితలం పై నుంచి దీని ఎత్తు 1200 మైళ్లు. కిలోమీటర్లలో లెక్కేసుకుంటే 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఈ కక్ష్య. భూమికి, కక్ష్య మధ్య ఈ ఎత్తులో ఉపగ్రహాలు ప్రతి రెండు గంటల ఏడు నిమిషాలకు ఒకసారి పరిభ్రమిస్తుంటాయి. వాటి సంఖ్య 84 వరకు ఉంటుంది. భూమిపై మనం ఉపయోగించే టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేయాలంటే ఈ లియో కక్ష్యకు లోబడి పరిభ్రమించే ఉపగ్రహాలే అత్యంత కీలకమైనవి.
మనం రోజూ వినియోగించే ఇ-మెయిళ్లు, వీడియో కాన్ఫరెన్సుల వంటి డేటా కమ్యూనికేషన్లు సమగ్రంగా, సమర్థవంతంగా పనిచేయడంలో లియో పరిధిలో పరిభ్రమణం చెందే ఉపగ్రహాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. భూమితో ఎలాంటి అనుసంధానం లేకుండా ఇవి పనిచేస్తాయి. దీని వేగాన్ని లెక్కించడం సాధ్యం కాని పని. అత్యంత వేగంగా ఈ ఉపగ్రహాలు పరిభ్రమిస్తాయి. మనదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం గానీ, నాసా గానీ ఇప్పటిదాకా అంతరిక్షంలో పంపించిన ఉపగ్రహాలతో పోల్చుకుంటే.. లియో పరిధిలో తిరిగే ఉపగ్రహాల పరిభ్రమణం అత్యంత వేగంగా ఉంటుంది.
అంతరిక్షంలో `స్పేస్ జామ్`
లియో కక్ష్యలో తిరిగే ఉపగ్రహాల సంఖ్య వేలల్లో ఉంటోంది. ఇప్పటిదాకా 4000 ఉపగ్రహాలు లియో పరిధిలో ఉన్నాయి. ఇస్రో, నాసా సహా వివిధ దేశాల ప్రభుత్వ, ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు పంపించిన ఉపగ్రహాలే అవన్నీ. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రయోగించిన షాట్ డౌన్ శాటిలైట్.. వాటన్నింటి కంటే భిన్నమైనది. పనితీరులోనూ వైవిధ్యాన్ని కనపరిచేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమితో అనుసంధానం కోల్పోయి, అనాథగా పరిభ్రమించేవి, శక్తి విహీనమైనవి, కాలం చెల్లిన ఉపగ్రహాలు వేలల్లో లియో కక్ష్య పరిధిలో పరిభ్రమిస్తున్నాయి. వాటినే శాస్త్రవేత్తలు `స్పేస్ జామ్`గా పరిగణిస్తుంటారు.
శక్తివిహీనమైన ఉపగ్రహాలను పేల్చేయడానికి సరికొత్త ఆయుధం
అలాంటి ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు పేల్చివేస్తుంటారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఆయుధాన్ని తయారు చేశారు. అదే యాంటీ-శాటిలైట్ వెపన్. ఏదైనా ఉపగ్రహాన్ని ఇది పేల్చివేసిందంటే.. అనంతరం ఏర్పడే పరిస్థితులను ఇట్టే అదుపు చేయగల, మసి చేయగల సామర్థ్యం దీనికి ఉంది. పేలుడు అనంతరం వెలువడే శకలాలు గానీ, శిథిలాలు గానీ భూ కక్ష్యలోకి ప్రవేశించక ముందే బూడిద చేసే సామర్థ్యం షాట్ డౌన్ శాటిలైట్ కు ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ తరహా ఉపగ్రహాన్ని చైనా ఇదివరకే ప్రయోగించింది.
అంతరిక్షంలో సత్తా చాటిన భారత్, నాల్గో స్పేస్ పవర్గా అవతరణ
చైనాకు కూడా సాధ్యం కానిది..
భూమి ఉపరితలం మీది నుంచి 700 కిలోమీటర్ల ఎత్తులో షాట్ డౌన్ శాటిలైట్ ను ప్రయోగించింది. అంత ఎత్తులో భూమ్యాకర్షణ శక్తి ఏ మాత్రం పనిచేయదు. వాతావరణం అసలే ఉండదు. శబ్ద తరంగాలు ప్రయాణించలేవు. చైనా పేల్చివేసిన ఉపగ్రహానికి సంబంధించిన శిథిలాలు గానీ, శకలాలు గానీ ఇప్పటికీ.. అంతరిక్షంలో, లియో కక్ష్యలో తిరుగాడుతున్నాయి. దీనికి కారణం- భూమ్యాకర్షణ శక్తి లేకపోవడమే. దీనికి భిన్నంగా మనదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. చైనాకు కూడా సాధ్యం కాని ఘనతను సాధించింది. అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో ముందు ఉండే చైనాకు కూడా సాధ్యం కాని మైలురాయిని భారత్ అలవోకగా అందుకుంది.
300 కిలోమీటర్ల ఎత్తులో పేల్చేసే సామర్థ్యం..
భూ ఉపరితలానికి కేవలం 300 కిలోమీటర్ల ఎత్తులోనే ఉపగ్రహాలను పేల్చివేసిన ఘనతను అందుకుంది. 300 కిలోమీటర్ల ఎత్తు అంటే భూమ్యాకర్షణ శక్తి పని చేస్తుంది. అయినప్పటికీ- ఉపగ్రహాలను పేల్చివేసిన అనంతరం దాని శకలాలు, శిథిలాలు భూమి మీద పడవు. ఎందుకంటే- భూ వాతావరణంలోనికి ప్రవేశించడానికి ముందే అవి మాడి, మసైపోతాయి. అలాంటి శక్తి సామర్థ్యాలను భారత్ సొంతం చేసుకుంది. భారత్ తాజాగా ఏ ఉపగ్రహాన్ని పేల్చివేసిందనేది వేచి చూడాల్సిందే. కాలం తీరిన ఉపగ్రహాన్ని పేల్చివేసందా? లేక కొత్తగా ప్రయోగించిన ఉపగ్రహాన్ని ఏమైనా పేల్చివేసిందనేది ఇంకా తేలాల్సి ఉంది.
మిషన్ శక్తి.. పేరుకు తగ్గట్టే
మిషన్ శక్తిలో భాగంగా- ఈ శక్తిమంతమైన ఆయుధాన్ని రూపొందించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం వెల్లడించారు. ఇప్పటిదాకా అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. తాజాగా భారత్ కూడా ఆయా దేశాల సరసన చేరింది. సగర్వంగా నిల్చుంది. ఈ తరహా ఆయుధాన్ని తయారు చేసిన నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించింది. 1958లో అమెరికా తొలిసారిగా యాంటీ శాటిలైట్ వెపన్ ను ప్రయోగించింది. ఘన విజయాన్ని అందుకుంది. 1964లో అప్పటి సోవియట్ రష్యా ఈ మార్క్ ను అందుకుంది. 2007లో చైనా, 2015లో రష్యా ఈ తరహా చయాంటీ శాటిలైట్ వెపన్ ను రూపొందించి, ప్రయోగించాయి. సత్ఫలితాలను సాధించాయి. తాజాగా భారత్ ఈ ఘనతను అందుకుంది. 1958లో అమెరికా.. తొలిసారిగా ఈ తరహా ఆయుధాన్ని అంతరిక్షంలోకి ప్రవేశించిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. వాటిని పెద్దగా ఖాతరు చేయలేదు అగ్రరాజ్యం అమెరికా.