రైలు పట్టాలపై ఉండొద్దని ఎంతో చెప్పా: పంజాబ్ ప్రమాదంపై నిర్వాహకుడి కంటతడి
అమృతసర్: విజయదశమి పండుగ సందర్భంగా నిర్వహించిన రావణ దహనం వేడుక అమృతసర్లో 62 మంది మరణానికి కారణమైన విషయం తెలిసిందే. ప్రమాదం అనంతరం స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు, నిర్వాహకుడైన సౌరభ్ మదన్ మిత్తూ పరారయ్యాడు. అయితే ఇప్పుడు అతడొక వీడియోను విడుదల చేశాడు.
తప్పు చేయలేదంటూ కన్నీటిపర్యంతం..
తాను ఏ తప్పూ చేయలేదని దాంట్లో కన్నీటి పర్యంతమయ్యాడు సౌరభ్ మదన్ మిత్తూ. తాను ఆ వేడుక నిర్వహణకు అనుమతి తీసుకున్నాని వెల్లడించారు.
10సార్లు హెచ్చరించా..
‘ఆ కార్యక్రమం నిర్వహణ కోసం అన్ని అనుమతులు తీసుకున్నా. వేడుక చూడటానికి వచ్చిన వారిని పట్టాల మీద నిల్చోవద్దని కనీసం 10 సార్లైనా హెచ్చరించా. ఆ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. కొందరు కావాలనే నా పేరు చెడగొడుతున్నారు' అని వీడియోలో వాపోయాడు. గుర్తు తెలియని ఓ ప్రాంతం నుంచి ఆ వీడియోను పోస్ట్ చేశాడు.
రైలు దూసుకెళ్లడంతో..
కాగా, ఈ ప్రమాదం జరిగిన తరవాత కాంగ్రెస్ కౌన్సిలర్ ఇంటిమీద ఆందోళనాకారులు రాళ్లు విసిరారు. రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తోన్న సమయంలో ఒక్కసారిగా రైలు దూసుకురావడంతో పట్టాల మీద నిల్చున్న అనేకమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
62కు చేరిన మృతుల సంఖ్య
తాజాగా ఆ ఘటనలో గాయపడిన 19 సంవత్సరాల యువకుడు చనిపోవడంతో మృతుల సంఖ్య 62కు చేరింది. అయితే తాము ఆ వేడుకకు అనుమతించామని పోలీసులు అంగీకరించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలని చెప్పామని కూడా వెల్లడించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసిన నిర్వాహకులు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.