ఢిల్లీ విజయంతో ఆప్ క్రేజీ ఎత్తుగడ.. సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిషోర్?..18న కీలక ప్రకటన..
ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పాతికమందికిపైగా కేంద్ర మంత్రులు.. 200 మంది ఎంపీలు.. 10 మంది ముఖ్యమంత్రులు.. వేల మంది కాషాయ సైనికులు.. వీళ్లందరినీ ఢీకొట్టిమరీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడొక సరికొత్త క్రేజీ ఎత్తుగడను ప్రయోగించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఆప్ గెలుపులో అరవింద్ కేజ్రీవాల్ కు అన్ని రకాలుగా తోడ్పాడు అందించిన ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ బహిషృత నేత ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా ముఖ్యమంత్రిని చేసేలా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఈనెల 18న వెల్లడికానుంది. ప్రకటన విషయాన్ని సాక్షాత్తూ పీకేనే మీడియాకు చెప్పడం ఉత్కంఠను రెట్టింపు చేసింది.
పీకే ఎలా పైకొచ్చాడో తెలుసా?
కెరీర్ ప్రారంభంలో ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి విశిష్ట సంస్థల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. చిన్న పిల్లల్లో పౌష్టికాహార లోపాలపై ఓ ఆర్టికల్ రాయడం.. అందులోని అంశాలు వినూత్నంగా ఉండటంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. పీకేను పిలిపించుకుని మాట్లాడటం.. క్రమంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పనితీరుపై విశ్లేషణలు చేసే స్థాయికి పీకే ఎదగడం చకచకా జరిగిపోయాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి అడపాదడపా సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోర్.. 2014 ఎన్నికలకు ముందు నుంచి ఆయన పూర్తిస్థాయి స్ట్రాటజిస్టుగా మారిపోయారు.
మోదీని ప్రధాని అభ్యర్థిగా బలంగా ప్రమోట్ చేయడంలో, కొత్తరకం ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి విజయం అందించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతి ఏడాదికే(2015లో) మోదీ, బీజేపీకి వ్యతిరేకంగానూ వ్యూహాలు రచించి విజయం సాధించారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే..
8 నెలలే గడువు..
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తమ టార్గెట్ బీహార్ అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. బీహార్ లో పుట్టిపెరిగి, అక్కడి రాజకీయాలు అణువణువూ తెలిసిన ప్రశాంత్ కిషోర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ నిలబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందటే పీకేతోపాటు జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన పవన్ వర్మ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆప్ సారధ్యంలో బీహార్ లో కొత్త రాజకీయాలు చూడబోతున్నారని పవన్ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 నెలలే గడువు ఉండటంతో ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని ఆప్ భావిస్తున్నట్లు తెలిసింది.
18న కీలక ప్రకటన ఇదే?
ఢిల్లీ ఫలితాల తర్వాత గురువారం తొలిసారి మీడియా ముందుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ తన భవిష్యత్ కార్యాచరణపై ఇలా అన్నారు.. ‘‘ఫిబ్రవరి 11 తర్వాత నేనేదో చెబుతానని అందరూ ఎదురుచూశారు. ఆ మేరకు నిరాశపర్చినందుకు సారీ. అయితే ఫిబ్రవరి 18న మాత్రం నేనొక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నా'' అని సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆ ప్రకటన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందేనని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాలనుకుందంటే..
ఫుల్ టైమ్ పొటిటీషయిన్ గా..
జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత చాలా కాలంపాటు సైలెంట్ గా ఉండిపోయిన ప్రశాంత్ కిషోర్.. తన రాజకీయ భవిష్యత్తుపై 18న ప్రకటన చేస్తానని చెప్పారు. అంతకుముందు పలు చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ తాను ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఉండాలనుకుంటున్నానని, ఎన్నికల వ్యూహాలు రచించే ‘ఐ ప్యాక్' సంస్థలో నేరుగా పనిచేయడం మానేస్తానని పీకే చెప్పారు.
సమాజంలో మార్పుల కోసం తాను సూచిస్తోన్న అంశాలను అన్ని పార్టీలు ప్రచారానికి వాడుకుని వదిలేస్తున్నాయని, తన సలహాల్లో కనీసం కొన్నింటినైనా అమలుచేస్తే ప్రజలకు గొప్ప మేలు జరుగుతుందని పీకే అన్నారు. నేరుగా తానే రాజకీయ నేతగా మారితే ఐడియాల ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది కాబట్టి సొంత రాష్ట్రానికి చెందిన జేడీయూలో చేరానని ఆయన గుర్తుచేశారు. గడిచిన రెండేళ్లుగా పాట్నాలోనే ఉంటోన్న పీకే.. బీహార్ లోని మూలమూలకూ తిరిగి పెద్ద సంఖ్యలో యువతను సమీకరించారు. క్షేత్రస్థాయిలో పీకే చేసిన పని అతని సీఎం అభ్యర్థిత్వానికి ప్లస్ అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇంకా వాళ్ల ప్లాన్ ఏంటంటే..
ముస్లింలు, దళితులే టార్గెట్..
రెండేళ్లుగా ప్రశాంత్ కిషోర్ బీహార్ లో విస్తృతంగా పనిచేస్తూనే, ఏపీలో వైసీపీకి, ఢిల్లీలో ఆప్కు వ్యూహకర్తగానూ వ్యవహరించారు. రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్ లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకే తరఫునా పీకే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీలో ఆప్ గెలుపు తర్వాత.. కేంద్రంలో మోదీని ఢీకొట్టగల సమర్థుడు కేజ్రీవాలే అనే వాదన తెరపైకొచ్చింది. 2014లోనే ఢిల్లీ వెలుపల ఆప్ పంజాబ్ లో పోటీచేసి సత్ఫలితాలు సాధించింది. 2019లో మాత్రం మళ్లీ బొక్కబోర్లా పడింది.
2020 అసెంబ్లీ ఎన్నికలతో కేజ్రీవాల్ మళ్లీ క్రేజీ స్టార్ అయిపోయారు. అదే ఊపులో యాంటీ బీజేపీ, లోకల్ సమస్యలే ఎత్తుగడలుగా బీహార్ లోనూ అడుగుపెట్టాలని ఆప్ ప్లానింగ్ చేస్తోంది. బీహార్ మొత్తం జనాభాలో 17 శాతం ముస్లింలు, 16శాతం దళితులు ఉన్నారు. ఈ రెండు వర్గాల ఓట్లు రాబట్టుకోగలిగితే ఆప్ గెలుపు సునాయాసమవుతుంది. బీసీ, ఓసీల్లోని పేద, మధ్యతరగతి వర్గాలు కూడా ఆప్ వైపు మళ్లే అవకాశాలు లేకపోలేవు. అయితే ఇదంతా ఈనెల 18 ప్రశాంత్ కిషోర్ చేయబోయే ప్రకటనపైనే ఆధారపడి ఉంటుంది. ప్రచారం జరుగుతున్నట్లు నిజంగానే ఆయన బీహార్ సీఎం అభ్యర్థిగా ప్రజలముందుకు వస్తారా? లేక ఇంకేదైనా కీలక విషయాన్ని వెల్లడిస్తారా? అనేది మరో నాలుగు రోజుల్లో తేటతెల్లమైపోతుంది.
బీహార్ లో పీకే ప్రయోగం..
బీజేపీకి దూరమైన తర్వాత ప్రశాంత్ కిషోర్ సాధించిన తొలి విజయం 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలే కావడం గమనార్హం. నిప్పు-ఉప్పులాంటి లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్లను మహాకూటమి పేరుతో ఒక్కటి చేశారాయన. ఆ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయినా, తర్వాతి ఏడాదికే జేడీయూ చీఫ్ నితీశ్.. ఆర్జేడీకి టాలా చెప్పి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు.
గత లోక్ సభ ఎన్నికల టైమ్ లో పీకే అధికారికంగా జేడీయూలో చేరి, పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే కేంద్రం సడెన్ గా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తెరపైకి తేవడం, ముస్లింలతోపాటు పేద వర్గాలూ దాన్ని వ్యతిరేకించడంతో పీకే సైతం బీజేపీకి వ్యతిరేకంగా వరుస ప్రకటనలు చేశారు. ఇది బీజేపీకి స్నేహితుడైన నితీశ్ కు కోపం తెప్పించడం, పీకే, పవన్ వర్మలను జేడీయూ నుంచి తొలగించడం తెలిసిందే. అస్సాంలో ఎన్ఆర్సీ ప్రయోగం దారుణంగా ఫెయిలైందని, దాన్ని కవర్ చేసుకోడానికే బీజేపీ సీఏఏ పేరుతో చట్టవిరుద్ధమైన పథకాన్ని రూపొందించిందని ప్రశాంత్ కిషోర్ విమర్శిస్తున్నారు. నీతీశ్ కుమార్ మాత్రం బీహార్ లో ఎన్ఆర్సీ అమలుకు రెడీగా ఉన్నారు. సో, సీఏఏ, ఎన్ఆర్సీపై తనదైన వాదనతో బీహారీలను పీకే ఆకట్టుకునే అవకాశముందని ఆప్ అంచనావేస్తున్నట్లు తెలసింది.