Disha murder Case: చట్టాలను మార్చడం వల్ల ఉపయోగం లేదు: వెంకయ్య నాయుడు: మన మైండ్ సెట్..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపలను సృష్టిస్తొన్న హైదరాబాదీ వెటర్నరి డాక్టర్ దిశ హత్యోదంతంపై ప్రస్తుతం పార్లమెంట్ లో రాజకీయంగా సెగలు రేపుతోంది. ఈ ఘటనపై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభ, రాజ్యసభల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి (కాంగ్రెస్), సౌగత్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్), రాజ్యసభలో జయా బచ్చన్ తదితరులు ఈ అంశంపై మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలు కొనసాగుతున్న అత్యాచారలు, హత్యల పరంపరపై ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై రాజ్యసభలో వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని స్వీకరించారు. చర్చకు అనుమతి ఇచ్చారు. దీనితో విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.
వాయిదా తీర్మానాన్ని అనుమతించిన తరువాత వెంకయ్య నాయుడు ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పుడున్న చట్టాల్లో మార్పులను తీసుకుని రావడం వల్ల ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. ప్రజల మైండ్ సెట్ మారాల్సి ఉందని, అప్పుడే మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలను తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు సైతం వ్యవహరించాల్సి ఉందని చెప్పారు.
అత్యాచారాలు జరిగే అవకాశం ఉందని సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందంచదగ్గ నైపుణ్యం అధికార యంత్రాంగానికి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ స్థాయిలో అధికారాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల తమకు ఉన్న దృష్టికోణాన్ని, అభిప్రాయాన్ని కాముకులు మార్చుకోవాలని సూచించారు. అత్యాచారాలనేవి సామాజిక దురాగతం తయారైందని అన్నారు.