నటి సుమలత ఎంపీగా పోటీ, ఆమె ఏం చేశారు, సీఎం కుమారస్వామి ఫైర్, కొడుకును పోటీ చేయించాలని!
బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు సుమలత మీద కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విమర్శలు మొదలు పెట్టారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సీఎం కుమారస్వామి మండ్యకు సుమలత చేసిన సేవులు ఏమిటి ? అని ఘాటుగా ప్రశ్నించారు.
భర్త అంబరీష్ చనిపోయాడని సుమలత మీద మండ్య ప్రజలు జాలి చూపిస్తున్నారని, దానిని రాజకీయం చెయ్యాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం కుమారస్వామి మండిపడ్డారు. నటిగా సుమలతను ప్రజలు ఆదరించారని, అంబరీష్ భార్యగా ఆమెను గౌరవించారని సీఎం కుమారస్వామి అన్నారు.
కొడుకు నిఖిల్ గౌడ
నిఖిల్ కుమారస్వామి రాజకీయ రంగప్రవేశంపై సీఎం కుమారస్వామి మాట్లాడుతూ అధికారుల పిల్లలు అధికారులు అవుతున్నారు, నటుల పిల్లలు నటులు అవుతున్నారు, క్రీడాకారుల పిల్లలు క్రీడాకారులు అవుతున్నారు, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు ఎందుకు కాకూడదు అని సీఎం కుమారస్వామి ప్రశ్నించారు.
కొడుకు టిక్కెట్ హైకమాండ్ !
హీరో నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసే విషయంలో ముఖ్యమంత్రి కుమారస్వామి స్పంధించారు. నిఖిల్ కుమారస్వామికి టిక్కెట్ ఇచ్చే విషయంలో జేడీఎస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సీఎం కుమారస్వామి అన్నారు.
సీఎం పక్కా ప్లాన్
నిఖిల్ కుమారస్వామిని మండ్య లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి ఆలోచిస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో జేడీఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో నటి రమ్యా మీద జేడీఎస్ అభ్యర్థి విజయం సాధించారు.
సుమలత పోటీ
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ తో పోటీ చెయ్యాలని నటి సుమలత ఆలోచిస్తున్నారు. అయితే మండ్యతో సుమలతకు ఏమిటి సంబంధం, ఆమె ఆంధ్రప్రదేశ్ లో జన్మించారని, మండ్యకు ఆమె ఏమి సేవలు చేశారని జేడీఎస్ ఎమ్మెల్సీ కేటీ. శ్రీకంటేగౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ తీరుతో అంబరీష్ అభిమానులు మండ్యలో ధర్నాలు చేస్తున్నారు.
సుమలత నిర్ణయంపై ఉత్కంఠ !
మండ్య లోక్ సభ నుంచి సుమలత పోటీ చేస్తారా ? ఆమె రాజకీయాల్లోకి వస్తారా ? అంటూ అంబరీష్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, అందరూ కావలసిన వారే అని సుమలత అంటున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోతే సుమలత స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిసింది. ఈ సందర్బంలో సీఎం కుమారస్వామి సుమలత తీరుపై మండిపడుతున్నారు.