షాకింగ్ : టెస్టులెన్ని.. కేసులెన్ని.. నమ్మశక్యమేనా.. ఇదీ భారత్లో కరోనా రియాలిటీ..
అమెరికా,ఇటలీ,స్పెయిన్,ఇరాన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతగా ఆందోళన పెట్టకపోవచ్చు. కానీ ఒక్కసారి వాస్తవాలను పరిశీలిస్తే మాత్రం.. భారత్లో కరోనాను తక్కువ అంచనా వేస్తున్నామా అన్న సందేహాలు కలగకమానవు. దీనికి కారణం.. ఆయా దేశాల్లో జరుగుతున్న కరోనా వైద్య పరీక్షలకు,భారత్లో జరుగుతున్న వైద్య పరీక్షలకు చాలా తేడా ఉంది. ఇటలీ లాంటి కేవలం 6కోట్ల పైచిలుకు జనాభా కలిగిన చిన్న దేశం కూడా ఇప్పటివరకు భారత్ కంటే 12 రెట్లు ఎక్కువ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించింది. దీన్నిబట్టి భారత్లో కేసుల సంఖ్య తక్కువగా నమోదవడానికి కారణమేంటో సులువుగా అంచనా వేయవచ్చు.
ఇప్పటివరకు భారత్లో జరిగిన టెస్టులు ఎన్ని..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) లెక్కల ప్రకారం భారత్లో మార్చి 25,ఉదయం 8గంటల వరకు 24,254 మంది వ్యక్తులపై 25,144 వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 581 మందికి పాజిటివ్గా తేలింది. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే.. దేశంలో ప్రతీ మిలియన్ జనాభాకు ఇప్పటివరకు కేవలం 18 టెస్టులు మాత్రమే జరిగాయి. అందుకే.. దేశంలో తక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తుండటం కూడా కేసుల సంఖ్య తక్కువగా నమోదవడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మిగతా దేశాల్లో కరోనా టెస్టుల సంఖ్య ఎలా ఉంది
చైనాను మినహాయిస్తే అమెరికా,ఇటలీ,సౌత్ కొరియా,బ్రిటన్ వంటి దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. భారత్తో పోల్చుకుంటే ఆ దేశాల్లో జరుగుతున్న కరోనా టెస్టుల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. ఒకసారి ఆ డేటాను పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇటలీలో 74,386 పాజిటివ్ కేసులు నమోదవగా.. మార్చి 25 నాటికి అక్కడ నిర్వహించిన టెస్టుల సంఖ్య 3, 24,445. అంటే ఒక మిలియన్ జనాభాకు 5628 టెస్టులు నిర్వహించినట్టు ఇటలీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. హెల్త్&సోషల్ కేర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం యూకెలో ఇప్పటివరకు 97,019 కరోనా టెస్టులు నిర్వహించగా.. 9529 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఒక మిలియన్ జనాభాకు 1469 టెస్టులు నిర్వహించారు.
ఏ రకంగా చూసినా భారత్ గణాంకాలు ప్రామాణికం కాదు?
సౌత్ కొరియాలో ఇప్పటివరకు 3,57,896 కరోనా టెస్టులు నిర్వహించగా.. 9332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఒక మిలియన్ జనాభాకు 6931 టెస్టులు నిర్వహించారు. చైనా,భారత్ తర్వాత అత్యధిక జనాభా కలిగిన అమెరికాలో ఇప్పటివరకు ఒక మిలియన్ జనాభాకు 1280 టెస్టులు నిర్వహించినట్టు కోవిడ్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో 85,594 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాలన్నీ పరిశీలిస్తే 130కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్లో ఒక మిలియన్ జనాభాకు కేవలం 19 కరోనా టెస్టులు నిర్వహించడం.. ఏ రకంగానూ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటమే భారత్లో పాజిటివ్ కేసులు తక్కువ నమోదవడానికి కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఎక్కువ టెస్టులు జరిపితేనే..
Indiaspend.com విశ్లేషణ ప్రకారం.. అప్పటికీ ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నమోదవుతున్నాయి. కాబట్టి టెస్టుల సంఖ్య పెరిగితే కానీ భారత్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయలేమని చెబుతున్నారు. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ వైరస్ నియంత్రణలో భారత్ కృషిని మెచ్చుకున్నప్పటికీ.. కేవలం లాక్ డౌన్ చర్యలే సరిపోవన్న హెచ్చరిక కూడా చేసింది. పాజిటివ్ కేసులను గుర్తించేందుకు ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం,రోగులకు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందించడం అవసరమని చెబుతున్నారు. ఇప్పటికైతే భారత్లో దాదాపు 700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం(మార్చి 26) ఒక్కరోజే అత్యధికంగా 88 కేసులు నమోదయ్యాయి.