బీహార్లో లాలూ యుగం ముగిసినట్టేనా..? ఈ ఎన్నికల ఫలితాలతో ఆర్జేడీ కథ కంచికేనా..?
బీహార్లో ఆ పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఆ పార్టీది. ఒకప్పుడు కింగ్లా ఉన్న ఆ పార్టీ నేడు దీనావస్థ స్థితికి చేరుకుంది. అసలు భవిష్యత్తులో పార్టీ ఉంటుందా అనే స్థాయికి పరిస్థితి చేరుకుంది. ఇంతకీ ఆ పార్టీ ఏంటి..? ఎందుకు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది..?
బీహార్ను ఒక ఊపు ఊపిన లాలూ ప్రసాద్ యాదవ్
రాష్ట్రీయ జనతాదల్... బీహార్లో ప్రధాన పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ రథసారథి లాలూప్రసాద్ యాదవ్ జైలులోశిక్ష అనుభవిస్తున్నందున ఈ పార్టీని సరైన మార్గంలో నడిపే నాయకుడు కరువయ్యాడు. పేరుకు లాలూ తనయుడు తేజస్వీయాదవ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ తండ్రిలా రాజకీయ చతురతను ప్రదర్శించలేకపోతున్నారు. ఒకప్పుడు ఈ పార్టీకి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. కానీ అదే ప్రజలు ఈ పార్టీకి దూరంగా వెళ్లినట్లుగా పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సారి లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఆర్జేడీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలింది. 1997లో పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి ఇంతటి ఘోర ఓటమిని ఎప్పుడూ ఆ పార్టీ మూటగట్టుకోలేదు. ఇక లాలూ యుగానికి తెరపడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లాలూ చాణక్యత లేకపోవడం పార్టీని దెబ్బతీసిందా..?
ఇక ఆర్జేడీ తిరిగి తన పూర్వవైభవం తెచ్చుకోవాలంటే అది ఒక్క లాలూతోనే సాధ్యమవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. బెయిల్పై లాలూ ప్రసాద్ బయటకు రావడమా...లేక ఆయన శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చి పార్టీని బతికించడమా అనేదానిపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉందని పొలటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఒక వేళ ఆయన బెయిల్ పై విడుదలైనా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలన్న నిబంధన ఉంది. అసలే 2020లో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో లాలూపై మరో ఐదు కేసులు ఇంకా విచారణ స్థాయిలోనే ఉన్నాయి.
ఇక లాలూ సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం లేకపోవడంతో పార్టీకి సరైన దిశా నిర్దేశం, పోల్ నిర్వహణలు కరువవడంతో ఆపార్టీ పోటీచేసిన అన్ని లోక్సభ స్థానాల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంది. 19 స్థానాల్లో పోటీచేసిన ఆర్టేడీ అన్ని స్థానాల్లో ఓటమిపాలైంది. లాలూ ప్రసాద్ యాదవ్కు ఇది అత్యంత ఘోర అవమానమే అని చెప్పాలి. లాలూ ప్రసాద్ యాదవ్ 2009, 2014లో అత్యంత కష్టసమయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్జేడీ 4 స్థానాల్లో విజయం సాధించింది. దీన్ని బట్టి చూస్తే లాలూ హవా క్రమంగా బీహార్లో తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన సామాజిక వర్గం కూడా క్రమంగా ఆర్జేడీకి దూరం అవుతూ వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఒకప్పుడు బీహార్ రాజకీయం అంటే లాలూదే..!
1989లో నాటి ఉమ్మడి బీహార్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా జనతాదల్తో కలిసి ప్రచారం నిర్వహించిన లాలూ ప్రసాద్ యాదవ్, మొత్తం 54 పార్లమెంట్ స్థానాల్లో జనతాదల్ పార్టీ 32 స్థానాలు గెలువడంలో కీలక భూమిక పోషించారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ చౌదరి చరణ్ సింగ్, దేవీ లాల్, కర్పూరి ఠాకూర్, శరద్ యాదవ్లతో పాటు సమానంగా నిలిచారు. కర్పూరి ఠాకూర్ మృతి తర్వాత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడి పాత్రను పోషించారు. ఇక 1990 అసెంబ్లీ ఎన్నికల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ ప్రయాణం మరో మలుపు తీసుకుంది. ఆ సమయంలో లాలూ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సోషలిస్టులు మాత్రం రామ్ సుందర్ దాస్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కానీ లాలూ రాజకీయ చాణక్యత ముందు నిలబడలేక పోయారు. ఇక వెనకబడిన తరగతులు వారికి, దళితులకు లాలూ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. దీన్నే క్యాష్ చేసుకున్నారు లాలూ. అదే సమయంలో ముస్లిం యాదవ్ ఫార్ములాను అమలు చేసిన లాలూ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.
లాలూ లేని ఆర్జేడీ ఊహించగలమా..?
లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోనే జనతాదల్ 1991లో 31 స్థానాలు, 1996లోక్సభ ఎన్నికల్లో 22 స్థానాలు గెలుచుకుంది. ఇక లాలూ ఎదుగుదలను ఓర్వలేని కొందరు జాతీయ స్థాయి నాయకులు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించగా లాలూ ప్రసాద్ యాదవ 1997 జూలై 25న సొంత పార్టీని పెట్టారు. ఆసమయంలో అసెంబ్లీలో ఉన్న జనతాదల్ సభ్యులంతా లాలూకు మద్దతుగా నిలిచారు.ఇక సీబీఐకి తను లొంగిపోయే ముందు తన భార్య రబ్రీదేవీని బీహార్ సీఎంగా ప్రకటించారు. ఇక ఇతర అగ్రకులాల సహకారంతో లాలూ ప్రసాద్ యాదవ్ తన సామాజిక వర్గంను కూడా పెంచుకునే ప్రయత్నం చేశారు. 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆర్జేడీ 17 స్థానాలు గెలుచుకుంది. ఇక 2000లో లాలూ ప్రసాద్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి క్లీన్ స్వీప్ చేసి రబ్రీదేవీని ముఖ్యమంత్రి చేశారు. ఈ సమయంలోనే బీహార్ నుంచి జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ సీట్లు 243కు తగ్గిపోగా... 40 లోక్సభ స్థానాలకు కుదించడం జరిగింది. 2004లో 22 లోక్సభ స్థానాలు గెలవడం ద్వారా మరోసారి కీలకం అయ్యారు లాలూ. యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి లాలూ ప్రాభవం తగ్గుతూ వస్తోంది.
లాలూ పార్టీకి దూరమవుతున్న సొంత సామాజిక వర్గం
2013లో లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు శిక్ష విధించిన తర్వాత పోటీ చేసేందుకు అనర్హుడయ్యాడు. 2014లో మోడీ మానియా ఉండగా ఆర్జేడీకి 4 లోక్సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇక వరుస వైఫల్యాలతో నితీష్ కుమార్తో లాలూ జోడి కట్టారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు.80 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశాయి. లాలూ జైలులో ఉండటం ఆ పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో సొంత యాదవ సామాజిక వర్గం వారే పార్టీకి దూరమయ్యారనేది ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోంది.