మీ చివరి కోరిక ఏమిటీ..? నిర్భయ దోషులను అడిగిన అధికారులు, కాగితంపై రాసివ్వాలని వారం గడుస్తోన్నా..
నిర్భయ దోషులు ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దోషులు ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల చివరి కోరిక ఏమిటని జైలు అధికారులు అడిగారు. గత వారం జైలు సిబ్బంది వారిని కోరిన ఇంతవరకు స్పందించలేదని అధికారులు పేర్కొన్నారు.
చివరి కోరిక
చివరి కోరిక ఏంటో కాగితంపై రాసివ్వాలని కోరినట్టు అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజ్ కుమార్ ధ్రువీకరించారు. కానీ వారి నుంచి చివరి కోరికకు సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. వారి రిప్లై కోసం ఎదురుచూస్తున్నామని.. కానీ వారి నుంచి సమాధానం మాత్రం ఇవ్వడం లేదన్నారు.
ఏది పడితే అదీ కాదు..
చివరి కోరిక ఏంటో చెబితే అందుకు తగిన ఏర్పాట్లను జైలు అధికారులు చేస్తారని చెప్పారు. అయితే తీర్చగలిగే కోరికను మాత్రమే తీరుస్తామని మెలిక పెట్టారు. వారి కోరికపై పరిపాలన విభాగం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఇదేకాదు చివరగా ఎవరినైనా కలుసుకోవాలని ఉందా అని కూడా అడిగారు. ఆస్తులను బదిలీ చేయాలా ? ఏదైనా ముఖ్యమైన వస్తువులు ఉంటే ఇవ్వాలా అని కూడా అడిగారు.
వాయిదాల పర్వం..
నిర్భయ దోషుల ఉరి శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. రివ్యూ పిటిషన్లు, క్యురెటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయడంతో గత కొన్నినెలల నుంచి పొడిగిస్తూ వస్తోంది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీస్తామని ఢిల్లీ కోర్టు జనవరి 17వ తేదీన డెత్ వారెంట్ జారీచేసింది.
ఇదీ కేసు నేపథ్యం..
2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించడంతో.. ఫిబ్రవరి 1వ తేదీన దోషులకు తీహార్ జైలులో ఉరితీయనున్నారు.