కర్ణాటక కాంగ్రెస్ లో అప్పుడే రచ్చ రచ్చ: డీసీఎం కోసం పోటీ, అడగడంలో తప్పేముంది
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకి వెళ్లింది. ఈ సందర్బంలో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ తారాస్థాయికి చేరడంతో రచ్చరచ్చ అవుతోంది. అడగడంలో తప్పేముంది అంటున్నారు మాజీ మంత్రి రోషన్ బేగ్.
నలుగురు పోటీ
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో నలుగురు పోటీ పడుతున్నారని వెలుగు చూసింది. దళితుడైన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్, వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్ప, డీకే శివకుమార్, మైనారిటీల నాయకుడు రోషన్ బేగ్ ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.
బలపరీక్ష ఎందుకు !
ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో మీరు ఉన్నారా అంటే డీకే. శివకుమార్ ఇలా అంటున్నారు. బలపరీక్ష నిరూపించుకుని మెజారిటీ శాసన సభ్యులను హైకమాండ్ ముందు పెట్టడానికి తాను సిద్దంగా లేనని, ఆ అవసరం తనకు ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ అన్నారు.
సోనియా, రాహుల్ నిర్ణయం
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో వారే నిర్ణయం తీసుకుంటారని, హైకమాండ్ ఆదేశాలను తాముపాటిస్తామని డీకే. శివకుమార్ వివరణ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఉన్నానని మాత్రం డీకే. శివకుమార్ చెప్పలేదు.
తప్పేముంది చెప్పండి
ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో మీరు ఉన్నారా అంటూ రేషన్ బేగ్ ను మీడియా ప్రశ్నించగా అందులో తప్పేముంది అని అన్నారు. ఎందుకు నేనే ఉప ముఖ్యమంత్రిని కాకూడదూ, అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నట్లే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ముస్లీం సోదరులు డిమాండ్ చేస్తున్నారని రోషన్ బేగ్ అన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రోషన్ బేగ్ చెప్పారు.