కేజ్రీ, మోడీ సంభాషించారిలా..: కేజ్రీ గ్రామంలో స్వీట్లు పంచుకున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అరవింద్ కేజ్రీవాల్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. వారి మధ్య ఫోన్ సంభాషణ ఇలా జరిగింది....
'విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. కలిసి పని చేద్దాం. మనందరం ఢిల్లీ అభివృద్ధి కోసం పని చేద్దాం' - మోడీ
'నేను మిమ్మల్ని త్వరలో కలువాలనుకుంటున్నాను' - కేజ్రీవాల్
'యస్. మనం కలుద్దాం. తేనీటి విందులో కలుద్దాం' - మోడీ అంటూ మోడీ ముగించారు.
అనంతరం మోడీ ట్వీట్ కూడా చేశారు. నేను అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడానని, అతనిని అభినందించానని, ఢిల్లీ పూర్తి అభివృద్ధి కోసం కేంద్రం సహకరిస్తుందని ట్వీట్ చేశారు. మరోవైపు, మోడీ గెలుపుపై ఆయన స్వగ్రామం ఆనందంలో తేలియాడుతోంది. అందరు మిఠాయిలు పంచుకున్నారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా త్వరలో పగ్గాలు చేపట్టనున్న అరవింద్ కేజ్రివాల్కు ఢిల్లీ పోలీసులు జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ఈ సెక్యూరిటీ కింద ఆటోమేటిక్ ఆయుధాలు ధరించిన 12 మంది కమాండోలు 24 గంటలూ కేజ్రీవాల్కు రక్షణగా ఉంటారు. కేజ్రీవాల్కు జడ్ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్నట్లు భద్రతా వ్యవహారాల స్పెషల్ కమిషనర్ ఎస్బికె సింగ్ మంగళవారం ఇక్కడ పిటిఐకి చెప్పారు.
కేజ్రీవాల్ ఎక్కడికి వెళ్లినా ఆయన వాహనానికి ముందు ఒక పైలట్ కారు, దాని వెనుక కమాండోలు ఉండే రెండు కార్లు ఉంటాయి. ఈ నెల 14న రామ్లీలా మైదానంలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
కేజ్రీవాల్కు కల్పించిన భద్రతా ఏర్పాట్ల గురించి ఢిల్లీ పోలీసులు ఆయన ఉంటున్న ఘజియాబాద్లోని పోలీసు అధికారులకు ఇప్పటికే తెలియజేసారు. క్రితంసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కేజ్రివాల్ సెక్యూరిటీ ఏర్పాట్లను అంగీకరించక పోయినప్పటికీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు తమంత తామే భద్రతా ఏర్పాట్లు చేయడం తెలిసిందే.