దేశంలో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి..కానీ అదేసమయంలో : NCRB నివేదిక
న్యూఢిల్లీ: దేశంలో అల్లర్లు తగ్గుముఖం పట్టినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) పేర్కొంది. అయితే అల్లర్లు జరిగిన సమయంలో మాత్రం దాని తీవ్రత భారీగానే ఉంటోందని వెల్లడించింది. 2017లో దేశం మొత్తం మీద సగటున రోజుకు 161 అల్లర్లు చోటుచేసుకుంటే 247 బాధితులుగా మిగిలారని వెల్లడించింది. 2017లో అల్లర్ల బారిన పడిన బాధితుల సంఖ్య 2016తో పోలిస్తే 22శాతం పెరిగిందని వెల్లడించింది.
అల్లర్లు తక్కువ.. బాధితులు ఎక్కువ
సోమవారం ఎన్సీఆర్బీ రిపోర్టును క్రైమ్ ఇన్ ఇండియా 2017 పేరుతో నివేదిక విడుదల చేసింది. 2017లో భారత్లో 58,880 అల్లర్లు చోటుచేసుకుంటే ఇందులో బాధితులు 90,934 మందిగా మిగిలారని నివేదిక వెల్లడించింది. ఈ ఏడాదితో పోలిస్తే గతేడాది నమోదైన అల్లర్ల సంఖ్య 61,974 ఉండగా బాధితుల సంఖ్య 73,744గా రికార్డు అయ్యిందని వెల్లడించింది. అంటే రోజుకు సగటున 169 అల్లర్లు 202 మంది బాధితులు ఉన్నారని నివేదిక వెల్లడించింది. అల్లర్లు అంటే ఒక్క మతపరమైన అల్లర్లుమాత్రమే కాదని భూవివాదంలో చెలరేగిన అల్లర్లు, ఆస్తుల కారణంగా, కులపరమైన అల్లర్లు, రాజకీయ కారణాలతో చెలరేగిన అల్లర్లు, వర్గ వివాదాల కారణంగా ఉత్పన్నమైన అల్లర్లు, విద్యార్థుల నిరసనల ద్వారా చెలరేగిన అల్లర్లు ఉన్నాయని నివేదిక వివరించింది.
ఐపీసీ సెక్షన్ 146 ఏం చెబుతోంది..?
ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 146 ప్రకారం ఒక సమూహం లేదా ఒక వ్యక్తి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడి హింసను చెలరేగేలా వ్యవహరిస్తే ఆ సమూహంలోని వారంతా లేదా వ్యక్తి శిక్షార్హుడని పేర్కొంటోంది. ఇలా అల్లర్లకు పాల్పడిన వారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని చెబుతోంది.
అల్లర్లలో దేశంలో బీహార్ అగ్రస్థానం
ఇదిలా ఉంటే అల్లర్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది బీహార్. 2017లో 11,698 అల్లర్లు బీహార్లో నమోదయ్యాయి. ఆ తర్వాత 8,990 కేసులతో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర (7,743)అల్లరు చెలరేగినట్లు నివేదికలో పొందుపర్చారు. 2016లో కూడా బీహార్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉండటం కొసమెరుపు. అల్లర్లలో బీహార్ తొలిస్థానంలో నిలవగా అల్లర్ల కారణంగా బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. 2017లో తమిళనాడులో 1935 అల్లర్ల కేసులు నమోదుకాగా అందులో బాధితుల సంఖ్య 18,749గా ఉన్నట్లు గణాంకాలు చెప్పాయి. అంటే తమిళనాడులో జరిగిన అల్లర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ దాని తీవ్రత మాత్రం భారీగా ఉన్నిందనేది అర్థమవుతోంది. ప్రతి అల్లరి ఘటనలో సగటున 9 మంది బాధితులుగా మిగిలినట్లు ఎన్సీఆర్బీ నివేదిక క్లారిఫై చేసింది.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఫస్ట్
ఇక అత్యంత ప్రశాంతగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడ కేవలం ఒక్క అల్లరి కేసు మాత్రమే నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 2 అల్లర్ల కేసులతో మిజోరాం, 5 అల్లర్ల కేసులతో నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాలు నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. మతపరమైన అల్లర్లు కేసులు 2016లో 869 రికార్డు కాగా 2017లో 723కు పడిపోయాయి. ఇక మతపరమైన అల్లర్లలో 2016లో 1,139 మంది బాధితులుగా మిగలగా 2017కు ఆసంఖ్య 1,092కు చేరింది. ఇక మతఘర్షణల్లో కూడా బీహార్ రాష్ట్రం ముందంజలో ఉంది. 2017లో బీహార్లో మతపరమైన అల్లర్లు 163 నమోదు కాగా.. ఆ తర్వాతి స్థానాల్లో 92 కేసులతో కర్నాటక 91 కేసులతో ఒడిషా రాష్ట్రాలు నిలిచాయి. హర్యానాలో 2016లో మతపరమైన అల్లర్లు 250 కేసులు నమోదు కాగా ఇందులో 271 మంది బాధితులుగా మిగిలారు. కానీ 2017 వచ్చే సరికి అక్కడ కేవలం 25 మతపరమైన అల్లర్లు మాత్రమే రికార్డు కావడం విశేషం.
కులపరమైన, భూవివాదంతో తలెత్తిన అల్లర్లు
కులపరమైన అల్లర్లలో 2016తో పోలిస్తే 2017లో 65శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. బాధితుల పరంగా కూడా సంఖ్య తగ్గింది. 2017లో ఉత్తర్ప్రదేశ్లో కులపరమైన అల్లర్లు 346 కేసులు నమోదు కాగా అదే 2016లో ఈ సంఖ్య 899గా ఉన్నింది. ఇక భూవివాదం ద్వారా, ఆస్తుల గొడవల కారణంగా చెలరేగిన అల్లర్లు చాలా ఎక్కువగా నమోదయ్యాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఇక భూవివాదం ఆస్తుల గొడవలతో చెలరేగిన అల్లర్లలో అత్యధిక కేసులు బీహార్(7,030)లో నమోదయ్యాయి. కర్నాటక, మహారాష్ట్ర ఉత్తర్ ప్రదేశ్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ గొడవల ద్వారా బాధితుల సంఖ్య చూస్తే మాత్రం తమిళనాడు రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. భూవివాదం ఆస్తుల గొడవ కారణంగా తమిళనాడులో తలెత్తిన అల్లర్లలో 17,045 మంది బాధితులుగా మిగిలినట్లు నివేదిక వెల్లడించింది.