ఇంకేం ఆధారాలు, ఒక్క జవాన్ పోతే, 2 పాక్ తలలు తేవాల్సిందే: ఇమ్రాన్ ఖాన్పై ఊగిపోయిన పంజాబ్ సీఎం
పంజాబ్: భారత్ దాడికి దిగితే ప్రతిదాడి తప్పదని, పుల్వామా దాడి విషయంలో తమకు ఆధారాలు కావాలని వ్యాఖ్యానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, జమ్ము కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీలు మంగళారం తీవ్రంగా స్పందించారు.
ఒక జవాన్ చనిపోతే 2 పాక్ తలలు తేవాల్సిందే
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చేతుల్లో మన జవాన్లు ఒక్కరు చనిపోతే పాకిస్తాన్కు చెందిన ఇద్దరి తలలు తీసుకు రావాల్సిందేనని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. పాకిస్తాన్కు ఏ భాషలో చెబితే అర్థమవుతుందో అదే భాషలో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు తాము మద్దతిస్తామని ఇప్పటికే కేంద్రానికి తాము తెలిపామని చెప్పారు.
ఇంకేం ఆధారాలు కావాలి
పాకిస్తాన్ పదేపదే మరిన్ని ఆధారాలు కావాలని చెబుతుందని, భారత్ అన్ని ఆధారాలు ఇస్తోందని, అలాంటప్పుడు ఇంకే ఆధారాలు కావాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశ్నించారు. జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్తాన్లో భద్రంగా ఉన్నారని మండిపడ్డారు. కనీసం మన సైన్యం ఎదురుకాల్పుల్లో చంపిన పాకిస్తాన్ తీవ్రవాదులను చూపించినా వారు అంగీకరించే పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. పదేపదే ఆధారాలు కావాలని ఇమ్రాన్ ఖాన్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇమ్రాన్ ఖాన్ ప్రకటన సరైనది కాదన్నారు. ప్రపంచానికి వాస్తవం తెలుసునని చెప్పారు.
పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్పై సౌదీ రాజు ప్రశంసలు, ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి పయణం!
ముఫ్తీ ఏమన్నారంటే
పీడీపీ అధినేత్రి ముఫ్తీ మాట్లాడుతూ.. పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. కాగా, పుల్వామా తీవ్రవాద దాడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తొలిసారి స్పందించారు. ఆధారాలు లేకుండా భారత్ తమను నిందిస్తోందన్నారు. ఉగ్రదాడితో పాక్కు సంబంధాలు ఉన్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఇలాంటి దాడి చేస్తే తమకు ప్రయోజనం ఏమిటన్నారు. తాము ఉగ్రవాదాన్ని కాదు స్థిరత్వాన్ని కోరుకుంటున్నామన్నారు. ఆ దిశగా పయనిస్తున్నామని, పుల్వామా దాడిపై మమ్మల్ని నిందించకండని, ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ తమపై ఆరోపణలు చేస్తోందని, శాంతి కోసం చేస్తున్న పోరాటంలో మేం ఇప్పటికే లక్షల మంది ప్రజలను కోల్పోయామని, మీరన్నట్లు నిజంగానే దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తేలితే దర్యాప్తునకు సహకరించేందుకు తాము సిద్ధమని, దానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పారు. అంతేకాదు, యుద్ధాన్ని ప్రారంభించడం సులువని, అది మన చేతుల్లోనే ఉంటుందని, కానీ ఆ యుద్ధం ఎక్కడ ముగుస్తుందన్నది ఆ దేవుడికే తెలియాలని, సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలని, దాడి చేస్తే పాక్ ప్రతిఘటించదని భారత్ భావిస్తోందని, కానీ మీ చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు.