నిజమే!: రాజన్ ఉండగానే రూ.2000నోటుపై ఉర్జిత్ సంతకం
కొత్త 2000 రూపాయల నోటు ముద్రణ విషయంలో ఓ సంచలన విషయం తాజాగా బయటపడింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంకా పదవిలో ఉండగానే ఉర్జిత్ కొత్త నోట్లపై సంతకాలు చేశారట.
ముంబై: కొత్త 2000 రూపాయల నోటు ముద్రణ విషయంలో ఓ సంచలన విషయం తాజాగా బయటపడింది. ఈ నోట్ల ముద్రణ గత సంవత్సరం ఆగస్ట్ 22న మొదలైనట్లు ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి. అంటే ఆర్బీఐ తర్వాతి గవర్నర్ ఉర్జిత్ పటేల్ అని ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజు. ఉర్జిత్ పేరు ఖరారైంది గానీ ఆయన రెండు వారాల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.
అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇంకా పదవిలో ఉండగానే ఉర్జిత్ కొత్త నోట్లపై సంతకాలు చేశారట. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే కొత్త రూ.2000 నోట్ల తొలి విడత ముద్రణ 2016 ఆగస్ట్ 22న జరిగింది. అంటే అప్పటికి రాజన్ ఇంకా పదవిలోనే ఉన్నారు.
ఆగస్ట్ 23న కొత్త గవర్నర్గా ఉర్జిత్ పటేల్ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 4 వరకు రాజన్ పదవిలోనే ఉన్నారు. రాజన్ సెప్టెంబరు 4న పదవీ విరమణ చేశాక.. ఉర్జిత్ గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు. కానీ కొత్తనోట్లపై రాజన్ కాకుండా ఉర్జిత్ సంతకాలు చేశారు.
అయితే కొత్త రూ.2000 నోట్లు ముద్రించాలన్నది రాజన్ నిర్ణయమే అయినప్పుడు కొత్త నోట్లపై ఆయన ఎందుకు సంతకాలు చేయలేదని ఆర్బీఐకి ఈ-మెయిళ్ల ద్వారా ప్రశ్నలు వచ్చాయి. వాటికి ఆర్బీఐ స్పందించలేదు. రాజన్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించారు.
కొత్త రూ.2000 నోట్లు ముద్రించాలని జూన్ 7, 2016న ఆర్బీఐకి ఉత్తర్వులు వచ్చాయి. అప్పటికి రాజన్ గవర్నర్ పదవిలో ఉన్నారు. మరి అలాంటప్పుడు రాజన్ నోట్లపై సంతకాలు చేయకపోవడంపై పలు సందేహాలు వెలువడుతున్నాయి. కాగా, రాజన్ సంతకం చేసేందుకు నిరాకరించిన కారణంగానే.. ఉర్జిత్ సంతకం చేయాల్సి వచ్చిందని సమాచారం.