ఎన్న సారువాడా ఇది..! చెన్నైలో డబ్బులు పంచుతూ దొరికిపోయిన సీయం..!!
Recommended Video
తమిళనాడు/హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొంత మంది నేతలు ప్రజల దగ్గరనుండి ఓట్లు కొల్లగొట్టేందుకు ఇంకేదో చేయాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి విచక్షణ కూడా కోల్పోతారు. కొందరు మైకుమందు నియంత్రణ కోల్పోయి మాట్లాడతారు. మరికొంత మంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరూ అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనుకుని నియమాలకు విరుద్దంగా నడుచుకుంటుంటారు. ఇదే క్రమంలో వారివారి స్థాయిని, హోదాను కూడా మరిచిపోయి ప్రజల్లో చులకనవుతుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తమిళనాడు లో చోటుచేసుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రజలకు డబ్బులు పంచుతూ పచ్చిగా దొరికిపోయారు. అరవ రాష్ట్రంలో తమిళ తంబీలు ఇప్పుడు ఈ సంఘటన గురించే పెద్దయెత్తున చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల వేళ ఓటర్లకు డబ్బులు పంచడం సహజం. కాని ఇక్కడ స్వయానా ఓ సీఎం డబ్బులు పంచడం అంటే మామూలు విషయం కాదు. ఎవరా సీఎం అనుకుంటున్నారా..తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి. పళనిస్వామి ఓటర్లకు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. మంగళవారం రెండోవిడత ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లకు ఆయన పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు.
ఓ పండ్ల దుకాణం వద్దకు వెళ్లిన పళనిస్వామి అక్కడున్న మహిళతో మాట్లాడుతూ తమకు ఓటేయాలని కోరారు. సీఎం తన వద్దకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి పాంప్లెట్లలో డబ్బులు పెట్టి తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాల్సిందిగా అభ్యర్థించారు. మహిళకు సీఎం డబ్బులు ఇస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కి అనంతరం సోషల్ మీడియాకు ఎక్కింది. దీంతో సదరు సీయం నిర్వాకం బట్టబయలైంది.