చంపేయాలా: తపస్ రేప్ వ్యాఖ్యలపై దీదీ ఫైర్
కోల్కతా: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు తపస్ పాల్ చేసిన అత్యాచార వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తపస్ పాల్ బహిరంగంగా క్షమాపణ కోరుతాడని ఆమె చెప్పారు. "అతని విషయంలో నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు, అతన్ని చంపేయాలా?" అని ఆమె మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జూన్లో తపస్ పాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిపిఎం వాళ్లు తనను చంపాలని అనుకున్నా, తమ కార్యకర్తలను వేధించినా తాను వదిలిపెట్టబోనని, వాళ్ల ఇళ్లకు తన మనుషులను పంపించి, వారి ఆడవాళ్లపై అత్యాచారాలు చేయిస్తానని తపస్ పాల్ అన్నారు.
తపస్ పాల్ చాలా తప్పు చేశాడని, పార్టీ అతన్ని హెచ్చరించిందని, ఇంకా తానేమీ చేయాలని అనుకుంటున్నారని మమతా అన్నారు. తపస్ పాల్ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణ చెప్పారు. ఆయన భార్య నందినీ పాల్ అంతకు ముందే క్షమాపణ చెప్పారు.
అయితే, తపస్ పాల్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. తపస్ పాల్ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెసు దూరంగా ఉన్నారు. మమతా బెనర్జీ తపస్ పాల్పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని వారు చెప్పారు.