విజన్ 2020: అబ్దుల్ కలాం స్వప్నం సాకారమైందా? భారత్ ఎలా ఉండాలనుకున్నారు..?
న్యూఢిల్లీ: విజన్-2020. 2020 ఓ ల్యాండ్ మార్క్. దేశ చరిత్రలో మైలురాయి. రెండు దశాబ్దాల కాలంగా మనదేశంలో వినిపిస్తోన్న మాట ఇది. 2020 నాటికి మనదేశం ఎలా ఉండాలి అనే అంశంపై చాలామంది చాలా రకాలుగా కలలు గన్న అంశం. అందరికంటే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎలాంటి కలలు కన్నారు? అవి సాకారం అయ్యాయా? మనదేశం ఎలా ఉండాలని ఆయన అనుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానమే..
గ్రామ స్వరాజ్యం.. పల్లెలకు శాస్త్ర సాంకేతిక ఫలాలు..
2020 నాటికి మనదేశంలో గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాలని అబ్దుల్ కలాం భావించారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి గ్రామాలకు చేరాలని, తద్వారా పల్లెలు సమగ్రాభివృద్ధిని సాధించగలవని చాటి చెప్పారు. గ్రామాలను పట్టణాలు, నగరాలతో అనుసంధానం చేయడానికి సాంకేతికత ఉపయోగపడుతుందని అన్నారు. ఆ దిశగా శాస్త్ర, సాంకేతిక రంగాలను అభివృద్ధి పర్చాల్సి ఉంటుందని అబ్దుల్ కలాం దిశానిర్దేశం చేశారు.
గ్రామాలన్నింటికీ.. పట్టణ సదుపాయాలు..
గ్రామీణ ప్రాంతాలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంతో అవి అభివృద్ధి పథంలో పయనించినట్టు కావనేది అబ్దుల్ కలాం అభిప్రాయం. నాణ్యమైన విద్య, అంతే నాణ్యమైన వైద్యంతో పాటు టెలి మెడిసిన్ ను సైతం గ్రామాలకు చేరువ చేయాల్సి ఉంటుందని ఆయన అభిలాషించారు. అత్యాధునిక పద్ధతుల్లో విద్య, వైద్యాన్ని కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజలకు స్వయం సమృద్ధిని కల్పించినట్టవుతుందని ఆయన చాలా సందర్భాల్లో ప్రకటించారు.
ప్రతి వ్యక్తీ అక్షరాస్యుడు కావాలంటూ..
దేశంలో ప్రతి వ్యక్తీ అక్షరాస్యుడు కావాలనేది అబ్దుల్ కలాం అకాంక్ష. ప్రత్యేకించి- గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతను పారద్రోలాల్సి ఉంటుందని భావించారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని ఆయన మార్గదర్శనం చేశారు. వందశాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉందని, ప్రతి రాష్ట్రం కూడా నిర్బంధ విద్యను గ్రామీణ నిరుపేద విద్యార్థులకు అందించాల్సి ఉంటుందనే సందేశాన్ని చాటారు.