పోలీసులు ఏం చేస్తున్నట్టు.. పాల్ఘర్లో సాధువుల హత్యపై ఆర్ఎస్ఎస్ చీఫ్..
మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఇటీవల జరిగిన ఇద్దరు హిందూ సాధువుల హత్యపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. మన సమాజంలో హింసకు ఏమాత్రం తావు లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని గుర్తుచేశారు. ఆన్లైన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన సందేశంలో మోహన్ భగవత్ పాల్ఘర్ ఘటనపై మాట్లాడారు.
మానవత్వం ఫరిడవిల్లాలని ప్రార్థించే సాధువులను కిరాతకంగా హత్య చేయడం దారుణమన్నారు భగవత్. ఇంత దారుణం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నారు. సాధువులు మానవత్వానికి దూతల వంటి వారని.. వారు నమ్మే మతాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు.
చనిపోయిన ఆ ఇద్దరు సాధువులకు నివాళులు అర్పించాల్సిందిగా హిందూ ధర్మ ఆచార్య సభ విజ్ఞప్తి చేసినట్టు భగవత్ తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కూడా దీనిపై ఒక కార్యాచరణ తీసుకుందని.. మనమంతా కలిసి సాధువులకు నివాళి అర్పించాలని అన్నారు. ప్రజలు ఆవేశం,ఆక్రోశం తగ్గించుకోవాలని మత పెద్దలు ప్రజలకు సూచించాలన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని అసాంఘీక శక్తులు కాచుకు కూర్చున్నాయని చెప్పారు.
తబ్లిగీ జమాతే ఘటన గురించి మాట్లాడుతూ.. జరిగిన తప్పును ఒక కమ్యూనిటీకి ఆపాదించడం సరికాదన్నారు. అయితే దేశాన్ని విచ్చిన్నం చేసి.. ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న అసాంఘీక శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా,పాల్ఘర్ జరిగిన మూక దాడిలో చిక్నే మహరాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్ (35), వారి డ్రైవర్ నీలేశ్ తెల్గాడే (30) మృతి చెందారు. కారులో ముంబై నుంచి సూరత్ వెళ్తున్న వీరిని దొంగలుగా అపోహ పడి పాల్ఘర్ వాసులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి 101 మందిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు.