మెమెన్కి ఉరిశిక్ష అమలు: రాత్రి తిన్లేదు, నిద్రపోలేదు!
నాగపూర్: యాకూబ్ మెమెన్కు ఆయన పుట్టిన రోజు నాడే, గురువారం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. యూకూబ్ మెనన్ రాత్రి నిద్రపోలేదు. ఎవరితోను మాట్లాడలేదు.
అధికారులు వన్ ఇండియాతో మాట్లాడారు. అతను చాలా తక్కువగా మాట్లాడాడని, తనకు ఉరి శిక్ష ఖాయమని అతనికి రాత్రి అర్థమయిపోయిందని చెప్పారు.
యాకూబ్ మెమెన్కు ఉరిశిక్ష నుంచి విముక్తి లభిస్తుందని చివరి వరకు భావించిన అతని కుటుంబ సభ్యులను, అతను చివరిసారిగా చూడాలనుకున్నారని చెప్పారు. ఉరిశిక్ష విషయమై తన తరఫు న్యాయవాది చెప్పినప్పుడు అతనితో చాలా కష్టంగా మాట్లాడారని చెప్పారు.
కాగా, ఉరిశిక్షకు ముందు రోజు జైలు అధికారులకు చాలా క్లిష్టమైన రోజు అని చెప్పవచ్చు. బుధవారం మొత్తం యూకూబ్ మెమెన్ ఉరి శిక్ష పైన డ్రామా నడిచింది. జూలై 29 బుధవారం నాడు సుప్రీం కోర్టు మెమెన్ పిటిషన్ను తిరస్కరించింది. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
మరోవైపు ఢిల్లీలో మెమెన్ ఉరిశిక్ష రద్దు పైన అర్ధరాత్రి వరకు చివరి ప్రయత్నాలు చేశారు. అర్ధరాత్రి తర్వాత సుప్రీం కోర్టు అసాధారణంగా విచారించింది. రోజంతా అనేక మలుపులు తిరిగింది.
మెమెన్ రాత్రి 11.40 గంటలకు మరోసారి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అర్ధరాత్రి త్రిసభ్య బెంచ్ వేసి, దానిపై మూడున్నర గంటల నుంచి నాలుగున్నర, అయిదు గంటల వరకు విచారణ జరిగింది. న్యాయస్థానం యాకూబ్ మెమెన్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఉరి ఖాయమైంది.