వెంకయ్యా... మీ మాటలకు అర్థం ఏందయ్యా..!
రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా పడిపోయాయా.. ? అదికారం లోకి వచ్చినా, పదవి స్థాయి పెరిగినా ప్రజాప్రయోజనాలు పక్కకు పెట్టాల్సిందేనా..? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పదవులు ఉండవా..? పరిమితులతో కూడుకున్న రాజకీయ పదవులు ఎవరిని ఉద్దరించడానికి..? ఉన్న స్వేచ్చను హరించి, భావాన్ని వ్యక్తం చేయలేకుండా, వ్యవస్థలోని న్యాయాన్యాయాలపట్ల స్పందించడానికి అలంకరించిన పదవి అడ్డుగా ఉంటే ఎందుకు ఆ పదవిలో కొనసాగడం..? కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు పదవి అడ్డుగా ఉందని భావిస్తున్నప్పుడు ఎందుకు ఆ పదవిని అంటి పెట్టుకుని ఉండటం..? ప్రజా ప్రయోజనాలకోసమా..?స్వార్థ రాజకీయాల కోసమా..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
అంతా రాజకీయం కోసమే... నైతిక విలువలకు పాతర..
రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా క్షణించి పోయాయి. ప్రజల కోసం ఏం చేయాలనుకున్నా రాజకీయ స్వార్థం ఉండాల్సిందే..!! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజప్రయోజనాలకోసం అదికార పార్టీతో పోరాడే పోరాటమంతా ఉత్త ట్రాష్ మాత్రమే.. అదికారం చేజిక్కించుకున్న తర్వాత ఏ ప్రజల ప్రయోజనాల కోసమైతే ప్రతిపక్షంలో ఉండి పోరాడారో అవన్ని తూచ్ అనాల్సిందే. ప్రస్తుత భారత రాజకీయాలు అలాంటి దౌర్బాగ్యంలో ఉన్నాయి. 2014లో సంపూర్ణ ఆదిక్యంతో అదికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు కొత్త భాష్యం నేర్పుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క ., అదికారంలోకి వస్తే ఒక లెక్క అన్నట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ విధానాలను తప్పు పట్టిన బీజెపి అదికారం చేజిక్కించుకున్న తర్వాత అంతకన్నా దరుణంగా వ్యవహరిస్తే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాల గోడును ఎవరికి చెప్పుకోవాలి..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లెక్క... అదికారం లో ఉన్నప్పుడు ఒక లెక్క..
వర్శాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ నాయకులు విచిత్రంగా, వింతగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అదికారంలో ఉన్న బీజెపి రాజకీయ చతురతను తారా స్థాయిలో ఉపయోగిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబందించి భారతీయ జనతా పార్టీ తన మేధా సంపత్తిని మొత్తం ఉపయోగిస్తోంది. విపక్షాలను తెలివిగా దెబ్బకొడుతున్నామన్న భ్రమలో తమలోని అసలు నైజాన్ని చాటుకుంటోంది బీజేపి. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన విభజన చట్టంలో సమూల మార్పులకు పట్టుబట్టిన బీజెపి అదికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించడం శోచనీయం. ఆంద్ర ప్రదేశ్ సత్వర అభివ్రుద్ది కోసం చట్టంలో పొందుపరిచిన అంశాల పట్ల ఆనాడు రాజ్యసభలో వెంకయ్య నాయుడు చేసిన వీరంగం దేశ ప్రజలకు తెలియంది కాదు. ఇప్పుడు అవే అంశాల పట్ల రాజ్యసభ సభ్యులు ప్రస్థావిస్తున్నప్పుడు స్పందించడానికి మాత్రం వెంకయ నాయుడికి పదవి అడ్డుతగులుతోంది. విభజన సమయంలో ఎవరెవరు ఏం మాట్లాడారో., ఏఏ ప్రతిపాదనలు చేసారో అన్నీ తనకు తెలుసని, స్పందించడానికి మాత్రం రాజ్యసభ ఛైర్మన్ పదవి అడ్డొస్తోందని పేర్కొనడం చూడడాదనికి, వినడానికి ఎబ్బెట్టుడా అనిపిస్తోంది.
బీజేపి నైజాన్ని ఖచ్చితంగా అంచనా వేసిన నేత కేసీఆర్..
రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో కలుస్తున్నా అందలం ఎక్కి పదవులను ఆస్వాదించాలనుకోవడం మూర్ఖత్వం కాక ఇంకేమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల అభివ్రుద్దికి బీజెపి సింహభాగంలో ఉంటుందని, ముఖ్యంగా అవశేష ఆంద్రప్రదేశ్ ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాన మంత్రి అభ్యర్థి హోదాలో నరేంద్ర మోది ఎన్నోసార్టు హామీ ఇచ్చారు. కాని అదికారంలోకి వచ్చాక అన్నీ హామీల పట్ల స్వయంగా ఆంక్షలను విధించుకున్నారు. ఆంద్ర ప్రదేశ్ కి సాయం పట్ల కేంద్ర వైఖరిని సూక్ష్మంగా గ్రహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యద్బుతంగా స్పందించారు. మీ నుంచి సహాయం కోరుకునే కన్నా ప్రేమను కోరుకుంటున్నామని మోదీ తో ప్రత్యక్షంగా చెప్పి సున్నితంగా బీజెపి చెంపను ఛెళ్లు మనిపించారు. ఏమీ లేని ఏపీకి సాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్ర బాబు నే పట్టించుకోని కేంద్రం, మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేస్తారన్న మర్మాన్ని ముందుగానే గ్రహించిన కేసీఆర్ హుందాగా వ్యవహరించారు. అందుకు తగ్గట్టుగానే కేంద్రంతో నైతిక విలువలకు భంగం కలగకుండా వ్యవహరిస్తున్నారు కేసీఆర్.
రాష్ట్ర ప్రయోజనాల కన్నా పదవులే ముఖ్యమంటే చరిత్ర హీనులగా మిగిలిపోవడం ఖాయం..
తెలుగు రాష్ట్రాలకు సంబందిచిన బీజెపి నేతలు కూడా ఏపి, తెలంగాణ రాష్ట్రాల అవసరాల గురించి గాని, జరుగుతున్న పరిణామాల గురించి గాని నోరు మెదపకపోవడం గమనార్హం. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్న పార్టీల నైజాన్ని ప్రజలు గ్రహించే స్థితిలో లేరనే భావన పార్టీ నేతల్లో పాతుకుపోయి ఉండి ఉండ వచ్చు. కాని సమయం సందర్బం కోసం ఎదురు చూసే ప్రజలు ఇచ్చే తీర్పుకు పార్టీలకు దిమ్మదిరిగి పోక మానదు. ప్రజా ప్రయోజనాలకు, అభివ్రుద్దికి రాజకీయ కోణాలను జోడించి తెలవిగా వ్యవహరిస్తున్నామని జబ్బలు చరుకునే పార్టీలు ప్రజల ఆగ్రహానికి గురై అదఃపాతాళానికి వెళ్లక తప్పదు. ఎలాంటి మౌళిక సదుపాయాలు కల్పిస్తే, ఎంత ఆర్థిక సాయం అందిస్తే రాష్ట్రాలు సత్వర అభివ్రుద్ది సాధిస్తాయో ప్రతిపక్షంలో ఉండి నిర్ధేశించినప్పుడు, అదికారంలోకి వచ్చాక వాటిని అమలుచేయడానికి ఎందుకు సందేహిస్తున్నారన్నది ప్రశ్న.
హామీలు అమలు చేయడం లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపి పెట్టిన ప్రతిపాదనలు అన్నీ రాజకీయ మైలేజ్ కోసమే అని నిర్ధారించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల పట్ల బీజేపి అనుసరిస్తున్న విధానాలు వందకు వందశాతం రాజకీయ ద్రుక్పదంతో కూడుకున్నవి తప్ప ప్రజా ప్రయోజనాలను కాంక్షించి చేస్తున్నవి మాత్రం ఏమాత్రం కాదని తెలుస్తోంది. అందుకు మంగళ వారం రాజ్యసభలో ఛైర్మన్ కుర్చీలోంచి గొంతెత్తి సుద్దులు మాట్లాడిని వెంకయ్య నాయుడు వాఖ్యలే నిదర్శనం..