అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిని చుట్టుముట్టిన వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా టీఆర్పీ స్కామ్తో పాటు టీపీ ఛానళ్ల రేటింగ్ సంస్ధ బార్క్తో ఆయనకున్న సంబంధాలను ముంబై పోలీసులు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా అర్నబ్ గోస్వామితో బార్క్ మాజీ సీఈవో పార్ధో దాస్ గుప్తా జరిపిన వాట్సాప్ సంభాషణ బయటపడింది.
అర్నబ్, పార్ధో దాస్గుప్తా వాట్సాప్ సంబాషణపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ తీవ్రంగా విరుచుకుపడింది. ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఆరోపించింది. వీరిద్దరి సంభాషణ చూస్తుంటే మన దేశంలో ఆర్ధిక అక్రమాలు ఎలా జరుగుతున్నాయో, ఇందులో ఉన్నత స్ధానాల్లో ఉన్న వారి పాత్ర ఏంటన్నది కూడా బయటపడుతోందని కాంగ్రెస్ విమర్శించింది. మంత్రివర్గంలో ఎవరుండాలో వద్దో జర్నలిస్టులు ఎలా నిర్ణయిస్తారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇదంతా చూస్తుంటే జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ల విభాగం చూస్తున్న రణ్దీప్ సూర్జేవాలా ఆరోపించారు.
అర్నబ్, పార్ధో దాస్ గుప్తా సంభాషణను పూర్తిగా పరిశీలించాక, ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించాలో, ఎవరితో దర్యాప్తు చేయించాలో, భవిష్యత్తులో దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని సూర్జేవాలా వెల్లడించారు. అధికారిక రహస్యాలు ఇలావ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ద్వారా నిస్సందేహంగా జాతీయ భద్రతపై రాజీ పడినట్లు కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఇదో తీవ్రమైన నేరమని, దీనిపై తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.