కరోనా వ్యాక్సిన్పై నిరాసక్తత- ఢిల్లీ సహా ఏడు రాష్ట్రాల్లో ఇదే పరిస్ధితి- విస్తృత ప్రచారం
కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకూ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన జనం.. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వేయించుకోవాలా వద్దా అనే విషయంలో భయపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ నత్తనడకన సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన కేంద్రం.. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మాత్రం విఫలమైంది. దీంతో చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వీరిలో స్ధైర్యం నింపేందుకు రాష్ట్రాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Recommended Video
నత్తనడకన కరోనా వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ను ఒకేసారి అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్ధాయిలో వ్యాక్సిన్ వేసే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించింది. జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రారంభమైనా ఇప్పటికీ వ్యాక్సిన్ అధ్భుతంగా పనిచేస్తుందన్న మాట ఎక్కడా వినిపించడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే కనీసం వ్యాక్సిన్ వేయించుకునేందుకు సైతం హెల్త్ వర్కర్లు సిద్ధం కావడం లేదనే వార్తలు దాదాపు ప్రతీ రాష్ట్రం నుంచీ వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బందే కాదు వైద్య ఆరోగ్యశాఖలు కూడా వ్యాక్సిన్పై వేచి చూసే ధోరణిని అవలంబించడమే ఇందుకు కారణం.
భయాలు వద్దంటున్న రాష్ట్రాలు
కరోనా వ్యాక్సిన్ను తొలుత ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. వారిలోనే భయాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇకపై రానురాను పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఇప్పుడు పలు రాష్ట్రాలు వ్యాక్సిన్పై ఆరోగ్య సిబ్బందిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. వ్యాక్సిన్లు సురక్షితమేనని, ఇప్పటికే పలు దశలు దాటుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య సిబ్బందికి భరోసా ఇస్తున్నాయి. అయినా ఇంకా పూర్తిస్ధాయిలో వ్యాక్సిన్ను నమ్మేందుకు వారు సిద్ధంగా లేరు.
సోషల్ మీడియా, ప్రకటనలతో ప్రచారం
వ్యాక్సినేషన్పై ఉన్న అపోహలను తొలగించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియా, వాట్సాప్, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాయి. వ్యాక్సిన్ జాబితాలో ఉండి డోసు తీసుకోని వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో విశ్వాసం నింపి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏడు రాష్ట్రాల్లో వ్యాక్సిన్పై నిరాసక్తత
దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొనేందుకు ఆరోగ్య సిబ్బంది ఆసక్తి చూపడం లేదన్న వార్తలు పలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో పరిస్ధితులు దారుణంగా ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి. వీటిలో రాజస్ధాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీ, అసోం, గుజరాత్లో హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వీరిని ఎలాగైనా ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో పంజాబ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాలు వ్యాక్సినేషన్పై విస్తృత ప్రచారం చేపడుతున్నాయి. రాజస్ధాన్లో ఆరోగ్యశాఖ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తోంది.