వాట్సాప్లో కొత్త ఫీచర్: ఒక మెసేజ్ బూటకమా.. లేక నిజమా ఇట్టే తెలుసుకోవచ్చు..!
వాట్సాప్... ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్. ఈ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. ఈ యాప్ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ వచ్చారు. తాజాగా మరో ఫీచర్ను కూడా వాట్సాప్లో చేర్చారు. ఒక ఫార్వర్డ్ మెసేజ్ వస్తే అది మీకు చేరకముందు ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిందో చెబుతుంది. అలాంటి ఫార్వర్డ్ మెసేజ్లను డబులు యారో గుర్తుతో కనిపిస్తాయి. అంతేకాదు పలుమార్లు ఫార్వర్డ్ అయిన ఈ మెసేజ్ను తిరిగి యూజర్ ఫార్వర్డ్ చేస్తే ఓ నోటిఫికేషన్ కూడా వస్తుంది.
'ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్ ' ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఒకే మెసేజ్ ఐదు సార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫార్వర్డ్ చేస్తే ఓ కొత్త లేబుల్ యూజర్కు కనిపిస్తుంది. ఎన్ని సార్లు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయబడిందో చెబుతుంది. ఇక పొడువైన మెసేజ్లు ఒకరు పంపిస్తే యూజర్కు పూర్తి మెసేజ్ కనిపించదు. అయితే పూర్తి మెసేజ్ చదవాలంటే ఓ ఆప్షన్ కూడా వాట్సాప్ తీసుకురానుంది. కొత్త ఫీచర్లతో యూజర్కు సరికొత్త అనుభవంను ఇవ్వనున్నట్లు వాట్సాప్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వాట్సాప్ కొత్త ఫీచర్లతో ఒక మెసేజ్ బూటకపు మెసేజా లేక సరైన మెసేజా అనేది తెలుస్తుంది. ఈ మధ్యకాలంతో బూటకపు మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ వేదికగా ఈ తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత కొద్ది నెలలుగా యూజర్లందరికీ వీటిపై అవగాహన కల్పించే కార్యక్రమం వాట్సాప్ చేస్తోంది. ఇప్పటికే మెసేజ్, వీడియో చాటింగ్, వాయిస్ కాల్స్తో యూజర్ల మన్ననలు పొందిన వాట్సాప్.. త్వరలో పేమెంట్ సర్వీసెస్ను కూడా ప్రారంభించనుంది. భారత్లో డిజిటల్ గ్రోత్ను బలోపేతం చేసే దిశగా వాట్సప్ అడుగులు వేస్తోందని ఆ సంస్థ గ్లోబల్ హెడ్ క్యాత్ కార్ట్ తెలిపారు.