సీఎం ఫడ్నవీస్ ఆఫీస్కు వెళ్లి ప్రశ్నించిన 11ఏళ్ల బాలిక
ముంబై: పదకొండేళ్ల విద్యార్థిని ఒకరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇలాంటి సమయంలో ఫడ్నవీస్ ఇంటర్వ్యూ కోసం విలేకరులు తాపత్రయపడుతుంటారు. అతని అపాయింటుమెంటు తీసుకునేందుకు విలేకరులే స్ట్రగుల్ చేస్తున్న సమయంలో ఈ పదకొండేళ్ల బాలిక మాత్రం అక్టోబర్ 31వ తేదీన అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించింది.
సదరు బాలిక తమ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఫడ్నవీస్ను ఇంటర్వ్యూ చేసింది. దృష్టి హర్చందాని ఆనే బాలిక ముంబైలోని జేబీ పటేల్ పాఠశాలలో చదువుతోంది. ఆమె ఇంటర్వ్యూ కావాలని లేఖ ముఖ్యమంత్రికి లేఖ రాసి మరీ, గత ఆదివారం అతనిని ప్రశ్నించింది.
దృష్టి హర్చందాని ఐదో తరగతి చదువుతోంది. స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లేందుకు తొలుత ఆమె ఫడ్నవీస్ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రికి లేఖ రాసింది.
డియర్ ఫడ్నవీస్, చీఫ్ మినిస్టర్ అంటూ ఆమె లేఖ ప్రారంభించారు. తనను సెక్యూరిటీ గార్డులు లోనికి రాకుండా అడ్డుకున్నారని, మీరు లేఖ అందుకోగానే తనకు సెల్ నెంబర్కు ఫోన్ చేయాలని లేఖలో పేర్కొంది. అందులో తన సెల్ నంబర్ కూడా ఇచ్చింది. స్కూల్ ప్రాజెక్టులో భాగంగా తాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నట్లు చెప్పింది.
ఎవరినైనా తన ఇంటికి పంపించాలని ముఖ్యమంత్రి భావిస్తే... అనే ఆలోచనతో లేఖలో ఆమె తన అడ్రస్ కూడా ఇచ్చింది. అందులో బీజేపీ పట్ల తన అభిమానాన్ని కూడా చాటుకున్నారు.
ఆ లేఖను చూసిన ఫడ్నవీస్కు తన కూతురు గుర్తుకు వచ్చింది. వెంటనే బాలికకు రమ్మని సమాచారం పంపించాడు. ఫడ్నవీస్ అపాయింటుమెంట్ దొరకడంతో బాలిక సీఎం ఇంటికి వచ్చి అతనిని ఇంటర్వ్యూ చేసింది. ఈ విషయమై ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
దృష్టి హర్చందాని తనను ఇంటర్వ్యూ చేయాలనుకొని వచ్చిందని, తొలుత సెక్యూరిటీ గార్డులు రానివ్వకపోతే, ఆమె లేఖ రాసిందని, దీంతో తాను ఆమె విజ్ఞప్తిని మన్నించినట్లు చెప్పారు. బాలిక లేఖను చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. కాగా, దృష్టి మలబార్ హిల్స్ ప్రాంతంలోని పోష్ ఏరియాలో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇది సీఎం నివసించే గెస్ట్ హౌస్కు దగ్గరలో ఉంది.