అది కదిలించింది: అజీమ్ ప్రేమ్జీని ప్రశ్నించిన అమ్మాయి
ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి సంతోషం గురించి ప్రశ్నించింది. దీనిని ప్రేమ్జీ తాజాగా సంస్థ ఉద్యోగులతో గుర్తు చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి సంతోషం గురించి ప్రశ్నించింది. దీనిని ప్రేమ్జీ తాజాగా సంస్థ ఉద్యోగులతో గుర్తు చేసుకున్నారు. నాలుగు వారాల క్రితం రాజస్థాన్లోని సిరోహిలో ఉన్న బలహీన వర్గాల పాఠశాలలో పరిస్థితులను ఆయన గమనించారు.
బాలబాలికలు ఆ పాఠశాల ఆవరణలో ఎంతో మనస్ఫూర్తిగా పాల్గొన్నారని ప్రేమ్జీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పదకొండేళ్ల అమ్మాయితో మాట్లాడానని అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
ఆవరణలో అసెంబ్లీ పూర్తయ్యాక ఓ అమ్మాయి ఆత్మవిశ్వాసంతో చాలా సంతోషంగా కనిపించిందన్నారు. ఆమెకు పదకొండేళ్ల కన్న ఎక్కువ వయస్సు ఉండదని చెప్పారు. తాను ఎంత సంతృప్తిగా, సంతోషంగా ఉన్నదో చెప్పిందన్నారు. ఆ మాట నిజాయితీ కనిపించిందన్నారు.
మీకు నిజమైన సంతోషం కలిగించేందుకు దోహదం చేసిన పరిస్థితులు ఏమిటని ఆ బాలిక సంధించిందని, ఆ చిన్నారి పరిశుద్ధ హృదయంతో అడిగిన ప్రశ్న తనను కదిలించిందన్నారు. ఆ క్షణమే మన సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించిందన్నారు.
ఆ ఆలోచనల్లో పుట్టిందే తమ ఫౌండేషన్ అని ప్రేమ్జీ తన సంస్థ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన విప్రో అనేక దాతృత్వ కార్యక్రమాలను చేపడుతోంది.
సంస్థకు వచ్చే ఆదాయంలో అనేక సమాజసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. విప్రోలో 40 శాతం దాతృత్వ ట్రస్టు కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తాను ప్రస్తావించిన అమ్మాయి లాంటి వారికి సహాయపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రేమ్ జీ తెలిపారు.