రసగుల్లా మాత్రం తప్పకుండా తీసుకొచ్చేవారు.. జైట్లీతో అనుబంధాన్ని గుర్తుచేసుకొన్న నితీశ్
న్యూఢిల్లీ : అరుణ్ జైట్లీ .. ఉద్యమకారుడు, లాయర్, రాజకీయ నేత, క్రికెట్ పరిపాలనాదక్షుడు, మంత్రి వీటన్నింటికి తోడు ఓ మంచి నేస్తం. అవును సొంత పార్టీలోనే కాదు భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకోవడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన చెప్పిందే శిరోధార్యం. అయితే 2014 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరపైకి వస్తే .. ఆయన స్నేహితులు గొడవపడి బయటకు వచ్చారే తప్ప .. జైట్లీ మాత్రం సర్దుకుపోవాలని సూచించడం ఆయనలోని రాజకీయ వివేకాన్ని చూపుతుంది.
2014 ఎన్నికల సమయంలో ఆరెస్సెస్ నరేంద్ర మోడీని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అరుణ్ జైట్లీ ప్రభ తగ్గిపోయింది. దీంతో అప్పటివరకు బీజేపీతో కలిసి మెలిసి ఉన్న జేడీయూ నేత నితీశ్ కుమార్ విభేదించారు. అంతేకాదు ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటకు వచ్చేశారు. కానీ చాన్నాళ్లకు .. జైట్లీ చొరవతో 2017లో మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. ఇక జేడీయూ నేత నితీశ్ కుమార్ .. జైట్లీకి మంచి స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు. 2004 నుంచి 2014 వరకు బీజేపీని నిర్మించడంలో జైట్లీ పాత్ర మరవలేం. ఈ సమయంలోనే గుజరాత్, మధ్యప్రదేశ్, బీహర్, కర్ణాటక బీజేపీ ఇంచార్జీగా పనిచేసిన జైట్లీ .. ఆ రాష్ట్రాల్లో కమల వికసించేందుకు దోహదపడ్డారు. కొత్త ఎత్తులతో ముందుకుసాగి .. తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
2005లో బీహర్లో బీజేపీ, జేడీయూ భాగస్వామ్య ప్రభుత్వం సీఎం అభ్యర్థి నితీశ్ కుమార్. ఆయన అరుణ్ జైట్లీకి మంచి ఫ్రెండ్ కూడా. జైట్లీ చర్చల ద్వారానే నితీశ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో నితీశ్ను కలిసేందుకు పాట్నా వెళ్లిన ప్రతీసారి ఆయనకు ఇష్టమైన రసగుల్లాను తీసుకెళ్లేవారు జైట్లీ. అదీ కూడా ఢిల్లీలోని ప్రముఖ మిఠాయి దుకాణం గోపాల నుంచి స్వయంగా తీసుకెళ్లేవారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు బీహర్ సీఎం నితీశ్ కుమార్. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసిందని నితీశ్ పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఉన్నత విలువలు కలిగిన నేతను కోల్పోయానని రోదించారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని నితీశ్ ట్వీట్ చేశారు.