పక్కా ప్లాన్తో ముందుకు సాగిన కాంగ్రెస్: ఆ 'యాప్' బీజేపీని దెబ్బతీసింది
బెంగళూరు: కన్నడ డ్రామా శనివారం యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ముగిసింది. కర్ణాటకలో బీజేపీపై తొలిసారి పైచేయి సాధించడం ద్వారా కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనికి పార్టీ సీనియర్ నేతలు శివకుమార్ సహా పలువురి వ్యూహరచన కారణం. ఈ వ్యూహరచనల్లో భాగంగా వారు చేసిన కాల్ రికార్డ్ మొబైల్ యాప్ కీలకంగా మారింది.
బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు అందివచ్చిన ప్రతిమార్గాన్ని వాడుకున్నాయి. బీజేపీకి అధికారం దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టుకు తరలించడం, ఆ తర్వాత హైదరాబాద్కు తరలించడం, పైగా తమకు ఎంతో నమ్మకమైన శర్మ ట్రావెల్ బస్సులను వాడటం, గవర్నర్ ప్రతి నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాలు చేయడం వంటివి చేశాయి. దీంతో పాటు కాల్ రికార్డింగ్ సాంకేతికతను ఉపయోగించుకోవడం వారికి బాగా ప్లస్ అయింది.
ఎన్నికల ఫలితాలు వెలువడి తొలిరోజే కాంగ్రెస్ పక్కా ప్లాన్తో సిద్ధమైంది. ఫలితాలు వచ్చిన గంటల్లోనే జేడీఎస్కు మద్దతు ప్రకటించి తమ పార్టీ ఎమ్మెల్యేలను ధ్రువీకరణలతో సహా మరుసటి రోజు బెంగళూరు రమ్మని ఆదేశించింది. అక్కడి నుంచి కన్నడ రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది.
ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. అక్కడ వారి నుంచి ఫోన్లను తీసేసుకుంటారని భావించారు. ప్రతి ఎమ్మెల్యే ఫోన్లో కాల్ రికార్డింగ్ యాప్ను ఇన్స్టాల్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేకు వచ్చే ప్రతికాల్ రికార్డు అయింది. ఇది తెలియని బీజేపీ నేతలు బేరసారాలకు దిగారు. దీంతో తొలుత శుక్రవారం గాలి జనార్దన్ రెడ్డి రాయచూర్ రూరల్ బసనగౌడ్తో సంభాషించడాన్ని రికార్డు చేసి మీడియాకు విడుదల చేశారు.
దీంతో పాటు యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర మాట్లాడుతున్న ఆడియో టేపు ఒకటి బలపరీక్షకు కొద్ది గంటల ముందుకు విడుదల చేశారు. దీంతో బీజేపీ ఆందోళనకు గురైంది. మీడియాకు అత్యంత సౌకర్యవంతమైన ఫార్మాట్లలోనే ఈ ఆడియో టేపులను కాంగ్రెస్ విడుదల చేసింది. దీంతో ఇవి బయటకు వచ్చిన క్షణాల్లో దేశం మొత్తం మార్మోగిపోయాయి. శాసన సభలో గందరగోళం చెలరేగితే మరింత అప్రతిష్ఠ పాలవుతామని భావించిన పార్టీ నాయకత్వం యెడ్డీని రాజీనామా చేయమని ఆదేశించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు.