ఢిల్లీ తగలబడి పోతోంటే అమిత్ షా కనిపించరు, నిజం మాట్లాడితే కోర్టును శిక్షిస్తారా..?: శివసేన
ఢిల్లీ అల్లర్లపై మరోసారి శివసేన ధ్వజమెత్తింది. ఢిల్లీ నగరం తగలపడిపోతోంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్కడున్నారని ప్రశ్నించింది. ఢిల్లీ తగలబడిపోతోంటే అమిత్ షా ఫిడేల్ వాయిస్తున్నారా అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఢిల్లీలో అల్లర్ల కారణంగా 38 మంది మృతి చెందారు. ఢిల్లీలో చెలరేగిన అల్లర్లతో దేశ ప్రతిష్ట దిగజారుతోందని అమిత్ షా మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేసింది శివసేన పార్టీ. అమిత్ షా ఎక్కడున్నారంటూ ప్రతి ఒక్కరి నోటా ఇదే ప్రశ్న వినిపిస్తోందని శివసేన మాతృపత్రిక సామ్నాలో కథనం ప్రచురితమైంది.
ఎన్నికల్లో కనిపించిన అమిత్ షా ఇప్పుడెక్కడున్నారు..?
ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రజలను కలిశారు కానీ.. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పాంప్లేట్లు ప్రజలకు పంచిన అమిత్ షా.. అదే నగరం కాలిపోతుంటే ప్రజలకు ఎందకు కనిపించరని సామ్నా ద్వారా శివసేన ప్రశ్నించింది. ఓ వైపు ఢిల్లీలో అమాయకులు మృతి చెందుతుంటే మోడీ.. మోడీ కేబినెట్లోని మంత్రులు అహ్మదాబాదులో చేతులు కట్టుకుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సలాం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించింది శివసేన పార్టీ. జాతీయ భావం మతతత్వంలతో దేశం 100 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందని తీవ్ర విమర్శలు చేసింది శివసేన.
అల్లర్లపై ప్రశ్నిస్తే దేశద్రోహం ముద్ర వేస్తారా..?
ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ప్రశ్నిస్తే దేశద్రోహి కింద ముద్ర వేస్తున్నారని అదే బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే మాత్రం అవి కనిపించడం లేదని దుయ్యబట్టింది శివసేన పార్టీ. రెచ్చగొట్టే ప్రసంగాలతోనే బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది శివసేన పార్టీ. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించిందని చెప్పిన శివసేన... దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడం మానేసి విద్వేషపూరితమైన ప్రసంగాలపై ఫోకస్ చేస్తోందని దుమ్మెత్తిపోసింది. ఇదిలా ఉంటే వాస్తవాలు, నిజాలు మాట్లాడితే కోర్టులకు సైతం శిక్ష విధిస్తున్నారంటూ ఢిల్లీ అల్లర్ల కేసును అర్థరాత్రి విచారణ చేసిన న్యాయమూర్తిని మరుసటి రోజు బదిలీ చేసిన విషయాన్ని ఉద్దేశిస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది.
నిజం మాట్లాడితే కోర్టులకు శిక్ష వేస్తారా..?
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఎంపీ పర్వేష్ మిశ్రా, కపిల్ మిశ్రాలు చేసిన ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమన్నందుకు జడ్జీనే బదిలీ చేస్తారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది శివసేన పార్టీ. జస్టిస్ మురళీధర్ చెప్పినదాంట్లో తప్పేముందని ప్రశ్నించింది. ఇక ప్రతిపక్షాలు కూడా సరైన పాత్ర పోషించడంలో విఫలమయ్యాయని శివసేన మండిపడింది. అదే ప్రతిపక్షంలో బీజేపీ ఉండి ఉంటే ఈ పాటికి రోడ్లను బ్లాక్ చేసి కేంద్ర హోంమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసేదని శివసేన తెలిపింది. కానీ బీజేపీ అధికారంలో ఉండటం.. విపక్ష పార్టీలకు సరైన సంఖ్యా బలం లేకపోవడంతో ఇది సాధ్యపడటం లేదని శివసేన పేర్కొంది.
Recommended Video
ఢిల్లీ అల్లర్లు 1984 అల్లర్లను తలపిస్తున్నాయి
1984లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన సిక్కు అల్లర్లను ప్రస్తుత ఢిల్లీ పరిణామాలు తలపిస్తున్నాయని మండిపడింది శివసేన. ప్రజలు కత్తులు కటార్లు, తుపాకులతో రోడ్లపై తిరుగుతున్నారని, రహదారులపై రక్తం పారుతుండటం చూస్తుంటే ఢిల్లీ అల్లర్లు ఒక హారర్ సినిమాను తలపిస్తున్నాయని శివసేన మండిపడింది. 1984లో జరిగిన అల్లర్లను తిరిగి ఇప్పుడు చూస్తున్నామని శివసేన ధ్వజమెత్తింది. ఇదిలా ఉంటే నాడు సిక్కుల ఊచకోతకు కారణం కాంగ్రెస్ అని ఇప్పటికీ బీజేపీ చెబుతుండటం హాస్యాస్పదంగా ఉందని శివసేన పేర్కొంది. ప్రస్తుత ఢిల్లీ అల్లర్లకు కారణం ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేసింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో ప్రదర్శించిన సాహసం ఢిల్లీ అల్లర్లను అణిచివేయడంలో ఎందుకు చూపడం లేదని శివసేన బీజేపీని సూటిగా ప్రశ్నించింది.