నాటి షాక్: క్యాస్ట్రోతో ఇందిర ఆలింగనం, మంచి స్నేహితుడిక లేడన్న మోడీ
క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మనదేశంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఒకసారి భారత్ సందర్శించారు క్యాస్ట్రో.
న్యూఢిల్లీ/హైదరాబాద్: క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మనదేశంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఒకసారి భారత్ సందర్శించారు క్యాస్ట్రో. అంతేగాక, నాటి ప్రధాని ఇందిరాగాంధీని క్యాస్ట్రో తన సోదరిగా భావించేవారు. 1983లో న్యూఢిల్లీలో జరిగిన ఏడో అలీనోద్యమ సమావేశానికి క్యాస్ట్రో వచ్చారు. ఆ సమావేశాల సందర్భంగా ఇందిరను క్యాస్ట్రో ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం ప్రపంచాన్నే ఆశ్చర్యపరచింది.
ఈ సమావేశాలకు రికార్డు స్థాయిలో వంద దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు 1979లో ఈ సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన క్యూబా దేశాధ్యక్షుడు ఈ సమావేశాల్లో ఆ బాధ్యతలు భారత్కు అప్పగించారు. తన సోదరి ఇందిరా గాంధీకి సమావేశాల బ్యాటన్ను అందించడం తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని క్యాస్ట్రో ప్రకటన చేశారు.
ఆ తర్వాత ఆ బ్యాటన్ అందుకోవడానికి ఇందిరాగాంధీ.. క్యాస్ట్రో దగ్గరికి వచ్చారు. రెండుసార్లు ఆమె చేయి చాచినా.. క్యాస్ట్రో మాత్రం బ్యాటన్ ఇవ్వకుండా నవ్వుతూ చూస్తుండిపోయారు. ఆ తర్వాత మూడోసారి బ్యాటన్ ఇవ్వకుండా ఇందిరను దగ్గరకు తీసుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో సమావేశ మందిరం చప్పట్లతో మారుమోగిపోయింది. అప్పట్లో ఈ ఘటన ప్రపంచంలో సంచలనంగా మారింది.
మంచి స్నేహితుడ్ని కోల్పోయాం: మోడీ
Fidel Castro was one of the most iconic personalities of the 20th century. India mourns the loss of a great friend.
— Narendra Modi (@narendramodi) 26 November 2016
I extend my deepest condolences to the Government & people of Cuba on the sad demise of Fidel Castro. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) 26 November 2016
విప్లవయోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి తన సానుభూతిని ప్రకటించారు. ఈ విషాద సమయంలో క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందన్నారు. పిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు వీరుడని పొగిడారు. ఆయన మృతితో భారత్ ఒక మంచి స్నేహితున్ని కోల్పోయిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.