కమాండోల బాధ్యత ఏమిటి?: జయలలిత విషయంలో ఏం జరిగింది?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై చాలా మంది అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు కూడా జయలలిత మరణంపై తమకూ సందేహాలున్నాయని తెలిపింది. అంతేగాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇది ఇలా ఉండగా, ఆస్పత్రిలో జయలలితకు భద్రతగా ఉన్న ఎన్ఎస్జీ కమాండోలు ఆమెను కలిశారా? లేదా అనే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.
ఎందుకంటే.. వీవీఐపీలకు భద్రత కల్పించే ఎన్ఎస్జీ కమెండోలు తాము భద్రత కల్పించే వ్యక్తితో పూటకోమారు మాట్లాడాలి. లేదా వారిని నేరుగా చూడాలి. ప్రతి రోజూ కేంద్రం హోంశాఖకు రెండు నివేదికలు పంపించాలి. అయితే, జయలలిత అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్ఎస్జీ దళం ఇంఛార్జీ ఆమెను చూశారా? చూస్తే కేంద్రానికి నివేదించారా? ఈ విభాగం ఏమీ నివేదించకపోతే, జయకు రక్షణ కల్పించడంలో విఫలమైతే కేంద్ర హోంశాఖ ఎలా స్పందించింది అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన సెక్యూరిటీ గార్డుల చేతనే హత్యకు గురైన తర్వాత దేశంలో జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) ఏర్పాటైంది. ఎన్ఎస్ జీ కమెండోలతో రాజకీయ ప్రముఖులకు, సీఎంలకు, ప్రధాని, మాజీ ప్రధానులకు, ఉగ్రవాదుల వల్ల ప్రాణాపాయమున్న వారికి వై, వై ప్లస్, జడ్, జడ్ ప్లస్ కేటగిరీలలో భద్రత కల్పిస్తున్నారు. ఎన్ఎస్జీ దళానికి తెలియకుండా వీవీఐపీలు ఏ ప్రాంతానికీ వెళ్లలేరు. తమిళనాట జయలలిత, కరుణానిధికి మాత్రమే జడ్ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. జయకు 40 మంది కమెండోలు భద్రత కల్పించేవారు.
ఎన్ఎస్ జీ కోడ్లో జయను 'పీపీ 27' అని పిలిచేవారు. అంటే... ప్రొటెక్టెడ్ పర్సన్ 27 అని అర్థం. జయ రోజూ ఎక్కడికి వెళుతున్నదీ, ఏ సమయంలో నివాసగృహానికి చేరుకున్నదీ తదితర వివరాలను ఈ దళం అధిపతిగా ఉన్న ఉన్నతాధికారి ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంశాఖకు నివేదించడం జరుగుతుంది.
కాగా, జయలలితకు 1991 నుంచి ఎన్ఎస్ జీ భద్రత కల్పిస్తున్నారు. ఆమెను సెప్టెంబర్ 22 రాత్రి అపోలో ఆసుపత్రికి తరలించినప్పుడు... ఆమె వాహనం వెంట ఎన్ఎస్ జీ దళం లేదు. ఆమె ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికి కమెండోలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాతి రోజు నుంచి... అంటే సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కమెండోల జాడ కనిపించలేదని సమాచారం. ఎన్ఎస్జీ నియమాల ప్రకారం భద్రత పొందుతున్న వ్యక్తి అస్వస్థతకు గురైనా ఆ వివరాలను ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు తెలియజేయాలి.
భద్రత పొందుతున్న వీవీఐపీ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నప్పటికీ... సదరు వ్యక్తిని నేరుగా వెళ్లి చూసి, పరిస్థితి గమనించాలి. ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఐసీయూలోకి వెళ్లదలచుకుంటే ఆయనను ఎవరూ అడ్డుకోరాదనే నిబంధన కూడా ఉంది. అయితే, జయకు భద్రతగా ఉన్న ఎన్ఎస్జీ ఉన్నతాధికారి ఐసీయూలో ఆమెను కలుసుకున్నారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ ఆ అధికారి జయను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నించినా ఎవరైనా అడ్డుకున్నారా?, అదే జరిగితే, అలా నిరోధించేంత అధికారం అక్కడ ఎవరికుంది? అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.