సత్యసాయిబాబాకు థ్యాంక్స్ చెప్పిన కరుణానిధి, పూర్వీకులు తెలుగువాళ్లే
తమిళనాడు: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. కరుణ అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లే. ఆయనకు ముగ్గురు భార్యలు. ఆయన చిన్న కొడుకు స్టాలిన్ ఇప్పుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
నాడు సత్యసాయి బాబాకు ధన్యవాదాలు
పదకొండేళ్ల క్రితం.. 2007 జనవరిలో హేతువాది కరుణానిధి, ఆధ్యాత్మికవేత్త, దేవుడిగా పూజలు అందుకునే సత్య సాయిబాబా వేదిక పంచుకున్నారు.ఏపీలోని కండలేరు జలాశయం నుంచి కృష్ణా నది నీటిని ఉత్తర తమిళనాడుకు తరలించేందుకు 150 కి.మీ. పొడవున కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం సత్య సాయిబాబా రూ.276 కోట్లు విరాళం ఇచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు సత్యసాయి ఉంగరం ఇవ్వగా కరుణ ఆనందించారు.
కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణ సాయంత్రం 6.10గంటలకు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాళ్. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలిస్తారు. ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలిస్తారు.