ఎందుకీ మౌనం... ఆజాద్ను మోదీ ఆకాశానికెత్తిన వేళ.. కాంగ్రెస్ నుంచి నో రియాక్షన్స్...
మంగళవారం(ఫిబ్రవరి 9) రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగం హాట్ టాపిక్గా మారింది. గులాంనబీ ఆజాద్ పనితీరుపై,ఆయన సమర్థతపై ప్రశంసలు కురిపించిన ప్రధాని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడంటూ కంటతడి పెట్టుకున్నారు. రాజ్యసభలో ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం కష్టమన్నారు. ఇలా మోదీ ఆజాద్ను ఆకాశానికెత్తిన వేళ కాంగ్రెస్ మాత్రం మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ నుంచి నో రియాక్షన్స్...
ప్రత్యర్థి అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ఆజాద్ను ఆకాశానికెత్తడం వ్యూహాత్మకమే అన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో తమ సొంత పార్టీ నేత రిటైర్మెంట్ వేళ కాంగ్రెస్ నేతలు మౌనం వహించడం దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది. సాయంత్రం సమయంలో పార్టీ అధికారిక ఖాతాలో రెండు ట్వీట్లు తప్పితే కాంగ్రెస్ నేతలెవరూ ఆజాద్ రిటైర్మెంట్పై నేరుగా స్పందించలేదు. ఆ రెండు ట్వీట్లలోనూ ఒకటి ఆజాద్ చేసిన ప్రసంగం కాగా... మరొకటి మరో రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ ఆజాద్ను పొగుడుతూ చేసిన ప్రసంగం.ఎంపీ శశి థరూర్ ఒక్కరే ఆజాద్ వీడ్కోలుపై ట్విట్టర్లో స్పందించారు. ఆయన మళ్లీ తిరిగొస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతే ఇంతకుమించి ఆజాద్కు వీడ్కోలుపై కాంగ్రెస్ నుంచి రియాక్షన్స్ ఏమీ లేవు.
ఆజాద్ ప్రసంగంలో వినిపించని రాహుల్ పేరు...
మంగళవారం ఆజాద్ రాజ్యసభలో సుమారు 30 నిమిషాలు భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తన 50 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఇందిరాగాంధీ,సంజయ్ గాంధీ,ఇతర దిగ్గజ నేతల పేర్లను ప్రస్తావించిన ఆయన రాహుల్ గాంధీ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన ప్రసంగం సాగిన తీరును బట్టి రాజ్యసభలో మరోసారి కాంగ్రెస్ ఆయనకు అవకాశం ఇవ్వకపోవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. గతేడాది లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మల్లిఖార్జున ఖర్గేను రాజ్యసభకు పంపించడం వెనుక.. ఆయన్నే కాంగ్రెస్ పక్ష నేతగా నియమించాలన్న వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆజాద్ను వెంటాడుతున్న జీ-23 వివాదం..
గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన అవసరమంటూ లేఖ రాసిన 23 మంది సీనియర్లకు ఆజాదే నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. పార్టీలో నాయకత్వ మార్పు,సంస్థాగత ప్రక్షాళన చేపట్టాలని ఆ 23 మంది డిమాండ్ చేశారు. ఈ లేఖపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవచ్చునని కొంతమంది నేతలు ఆజాద్పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. పార్టీ అధిష్టానం ప్రోత్సహంతో అన్ని రకాల పదవులు అనుభవించిన ఆజాద్ ఇప్పుడదే అధిష్టానంపై ధిక్కారం వినిపించడమేంటని ప్రశ్నించారు. అధిష్టానం మాత్రం ఆ లేఖపై నేరుగా ఏమీ స్పందించలేదు.
స్పందించేందుకు నిరాకరించిన కాంగ్రెస్ నేతలు
నిన్నటి ఆజాద్ భావోద్వేగపూరిత ప్రసంగం తర్వాత ప్రముఖ జాతీయ మీడియా పలువురు కాంగ్రెస్ నేతల స్పందన కోరగా... మాట్లాడేందుకు వారు నిరాకరించడం గమనార్హం. అంతేకాదు,ఆజాద్ గురించి మీరు మోదీని అడగాలంటూ ఓ కశ్మీరీ కాంగ్రెస్ నేత ఎద్దేవా చేసినట్లు ఆ మీడియా సంస్థ పేర్కొంది. అటు అధిష్టానాన్ని ధిక్కరిస్తూ లేఖ రాయడం,ఇటు మోదీ ప్రశంసలు రెండూ ఆజాద్కు మైనస్గా మారాయన్న వాదన వినిపిస్తోంది. అందుకే అటు అధిష్టానం గానీ ఇటు పార్టీ నేతలు గానీ ఆయన రిటైర్మెంట్పై మాట్లాడేందుకు సుముఖంగా లేరన్న చర్చ జరుగుతోంది.