యోగితో ములాయం రహస్య భేటీ?: రాజకీయాల గురించి కాదు, మరి?
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఎంలను ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఆయా నేతలు కొత్త ఇళ్లు వెతుక్కునే పనిలో పడ్డారు. బంగ్లాలను ఖాళీ చేసేందుకు ప్రభుత్వం 15రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మే 17వ తేదీన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు ఈ నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎన్డీతివారీ, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కల్యాణ్సింగ్, మాయావతి, రాజ్నాథ్ సింగ్లు ఉన్నారు. వీవీఐపీ జోన్లోని కీలకమైన బంగ్లాలన్ని వీరి ఆధీనంలోనే ఉండటంతో.. వాటిని ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, ప్రభుత్వ బంగ్లాల్లో అత్యంత ఖరీదైన విక్రమాదిత్య మార్గ్ లోని బంగ్లాల్లో ములాయం, అఖిలేశ్ ఉంటున్నారు. ములాయం ఉంటున్న ఇల్లు 25వేల చదరపు అడుగులు కాగా.. అఖిలేశ్ ఇల్లు 50వేల చదరపు అడుగులు. అఖిలేశ్ సీఎంగా ఉన్న సమయంలో దాదాపు 60కోట్లు ఖర్చు చేసి మరీ దీన్ని మరింత విలాసవంతంగా తయారుచేశారు.
తాజాగా ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు రావడంతో... ములాయం సీఎం యోగి వద్దకు పరిగెత్తుకెళ్లడం గమనార్హం. యోగితో ఆయన రహస్య సమావేశం పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఇందులో రాజకీయాంశాల ప్రస్తావన లేదు. కేవలం తాను ఖాళీ చేయబోతున్న బంగ్లా గురించే చర్చ. తాను, అఖిలేశ్ ఖాళీ చేయబోతున్న బంగ్లాలను తమ పార్టీకే చెందిన ఇద్దరు నేతలకు కేటాయించాల్సిందిగా ములాయం సీఎంను కోరినట్టు తెలుస్తోంది.
ఇక కొత్త ఇంటిని వెతికే బాధ్యతను సంజేయ్ సేత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి వీరు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ ఉంటున్న బంగ్లా 4కాళిదాస్ మార్గ్లో ఉంది. బంగ్లాను ఖాళీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న రాజ్నాథ్.. సొంత ఇంటికి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక మరో మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కూడా బంగ్లాను ఖాళీ చేసేందుకు సిద్దమైనట్టు సమాచారం. అయితే ఆయన మనువడు సందీప్ సింగ్ ఉత్తరప్రదేశ్ మంత్రి కావడంతో.. వారికోసం ఓ ప్రభుత్వ బంగ్లా సిద్దంగానే ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం నోటీసులపై స్పందించలేదని సమాచారం. అలాగే ఎన్డీ తివారీ మాల్ అవెన్యూ బంగ్లాలో అందుబాటులో లేకపోవడంతో ఆయనకు నోటీసులు అందలేదని తెలుస్తోంది.