మోడీ చెవిలో ములాయం గుసగుసలు: ఏం చెప్పి ఉంటారు?
మోడీ చెవిన ఏ విషయం వేశారో తెలియదు గానీ ములాయం చెబుతున్నంత సేపు మోడీ ఆసక్తిగా విన్నారు.
లక్నో: పంతాలు, పరస్పర ఆరోపణలు, దూషణలు ఇవన్నీ ఎన్నికల వరకే పరిమితం. ఒకసారి గెలుపెవరిదో ఖరారయ్యాక కొన్నిరోజులు వీటికి తెరపడాల్సిందే. యూపీ పాలిటిక్స్ లోను ప్రస్తుతం ఇదే జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం సందర్బంగా ప్రధాని మోడీ, ఎస్పీ అధినేత ములాయం సింగ్ తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
రాజకీయ విబేధాలను పక్కనబెట్టి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారానికి హాజరైన ములాయం, మాజీ సీఎం అఖిలేష్ ప్రధాని మోడీతో మాటలు కలిపారు. అఖిలేష్ తో కరచాలనం చేసిన మోడీ పలకరింపుగా ఆయన భుజం తట్టారు. అదే సమయంలో ములాయంతోను మోడీ ముచ్చటించారు. అయితే ఈ సందర్బంగా ములాయం మోడీ చెవిలో ఏదో చెబుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది.
మోడీ చెవిన ఏ విషయం వేశారో తెలియదు గానీ ములాయం చెబుతున్నంత సేపు మోడీ ఆసక్తిగా విన్నారు. కాగా, ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకాలేదు.
అతివాద 'మార్క్' కనిపించకుండా:
యోగి ఆదిత్యనాథ్ పై అతివాద హిందుత్వనేత అన్న ముద్ర ఉండటంతో ఆ ముద్రను చెరిపేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోడీ సైతం యూపీ అభివృద్దే తమ ఏకైక లక్ష్యమని, యూపీ అభివృద్ది చెందితే దేశం అభివృద్ది చెందుతుందని అభిప్రాయపడ్డారు. భవ్య, దివ్య భారత నిర్మాణం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు.
ప్రమాణస్వీకార కార్యక్రమ అనంతరం మోడీ ట్విట్టర్ ద్వారా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కొత్త ప్రభుత్వం రికార్డు స్థాయిలో అభివృద్ది సాధించేందుకు, రాష్ట్రాన్ని 'ఉత్తమప్రదేశ్'గా మార్చేందుకు కృషి చేస్తుందన్న నమ్మకముందని తెలిపారు.