బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోండి: పార్టీ నేతలకు రాహుల్ ఆసక్తికర సూచన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఎప్పుడూ విమర్శలు ఎక్కుపెడుతూ ఉండే రాహుల్ ఈ సారి దానికి భిన్నంగా మాట్లాడారు. ప్రజల నుంచి ఓట్లను ఎలా రాబట్టుకోవాలో బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నుంచి నేర్చుకోవాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించడం గమనార్హం.
పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం తొలిసారి ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కార్యనిర్వహక పద్దతిని ఎలా అనుసరించాలో బీజేపీని చూసి నేర్చుకోవాలని రాహుల్ వ్యాఖ్యానించారు. 17నిమిషాల రాహుల్ ప్రసంగంలో కొన్ని ఉదాహరణలు కూడా గుర్తుచేశారు.
మొదటి నుంచి దేశంలోని గిరిజన ఓటర్లు కాంగ్రెస్ పక్షాన నిలిచేవారని, బీజేపీ నేతలు గిరిజన గూడాల్లోకి వెళ్లి ప్రచారం చేయడంతో వారి ఓట్లను బీజేపీ సొంతం చేసుకోగలిగిందని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత పార్టీ కార్యకర్తలకు ప్రొత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా కష్టపడుతున్నారో కూడా వారి నుంచి నేర్చుకోవాలని రాహుల్ సూచించారు. రాహుల్ ప్రసంగాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కాసేపటికే తొలగించడం గమనార్హం.
ఈ సమావేశంలో 2019 కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అని సోనియా గాంధీ ప్రకటించిన విషయం తెలిసింది. ఎన్నికల్లో పొత్తులపై అంతిమ నిర్ణయం కూడా రాహుల్ గాంధీనే తీసుకుంటారని సోనియా స్పష్టం చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మొదట రాహుల్ గాంధీ నేర్చుకుని, ఆ తర్వాత పార్టీ నేతలకు సూచిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.