సీమాంధ్ర సిఎమ్అని సిద్ధరామయ్య: కరెక్ట్ చేసిన బాబు
బెంగళూరు: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, నారా చంద్రబాబు నాయుడు భేటీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెంగళూర్ పర్యటనకు వచ్చినప్పుడు సిద్ధరామయ్య అందుబాటులో లేరు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని పరిచయం చేయడానికి కాస్తా సమయం తీసుకున్నారు.
చంద్రబాబును ఆయన సీమాంధ్ర ముఖ్యమంత్రిగా పరిచయం చేశారు. అయితే, దాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లు లేరు. చంద్రబాబు నవ్వుతూ సిద్ధరామయ్య మాటలను సరిదిద్దారు. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో తెలంగాణ నుంచి మిగతా ప్రాంతాలను వేరు చేసి చెప్పడానికి సీమాంధ్ర పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ అవశేషాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరును అలాగే ఉంచారు.
ఉద్యమ నేపథ్యంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చిన సీమాంధ్ర పదమే సిద్ధరామయ్య మనసులో నాటుకున్నట్లుంది. ఐటిలో పోటీ పడుతున్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పరస్పరం నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. అంతే కాకుండా బహుమతులను ఇచ్చుకున్నారు. చంద్రబాబు సిద్ధరామయ్యకు తిరుపతి బొమ్మను బహుమతిగా ఇచ్చారు. ప్రతిగా సిద్ధరామయ్య చంద్రబాబుకు సంప్రదాయబద్దమైన మైసూరు టర్బన్ను అందించారు.
గత పర్యటనలో చంద్రబాబు నాయుడు ఐటి పెట్టుబడులను తన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ పరిశ్రమలకు ఉత్సాహన్ని నింపారు. చంద్రబాబు చొరవను, దూకుడును గమనించిన సిద్ధరామయ్య ఇన్ఫోసిస్ను కర్ణాటక బిడ్డగా అభివర్ణించారు. ఇన్పోసిస్ సమస్యను పరిష్కరించడానికి కూడా ముందుకు వచ్చారు.
ఐటి రంగంలో పోటీ అనేది తమ చర్చల్లో ప్రస్తావనకు రాలేదని, తుంగభద్ర కాలువల ఆధునీకరణ, ఇతర విషయాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చాయని ముఖ్యమంత్రులు చెప్పారు. ఇరువురు కూడా సహృదయతతో కరచాలనం చేసుకున్నారు.