ఇండోనేషియాలో పరిస్థితిపై అగ్నిపర్వతాన్ని అడుగుతా: నెటిజన్కు సుష్మా సూపర్ జవాబు
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఎవరైనా తమకు సమస్య ఉందంటే వెంటనే స్పందిస్తారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. అయితే అప్పుడప్పుడు కొందరు విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తారు. చిత్రమైన బాధలు ఆమె ముందు పెడతారు. ఆమె కూడా స్పాంటేనియస్గా అందుకు తగినట్లుగా స్పందిస్తారు. కొన్నిసార్లు మంచి కౌంటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా, అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. తాను ఓ దేశం వెళ్లాలనుకుంటున్నానని, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని, భద్రమేనా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దానికి సుష్మా స్వరాజ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆమె సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇండోనేషియా వెళ్లాలనుకుంటున్నా.. ఎలా ఉందో చెప్పండి
సుషీల్ రాయ్ అనే వ్యక్తి సుష్మాకు ఓ విజ్ఞప్తి చేశారు. తాము ఇండోనేషియా వెళ్లాలనుకుంటున్నామని, ఈ నెల 11వ తేదీన అక్కడికి వెళ్లాల్సి ఉందని, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయని, దీనిపై మన ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా, దయచేసి వివరాలు చెప్పండని పేర్కొన్నారు.
నేను అగ్నిపర్వతాన్ని సంప్రదించాలి
దీనిపై సుష్మా స్వరాజ్ సరదాగా స్పందించారు. నేను అక్కడ అగ్నిపర్వతాన్ని సంప్రదించాల్సి ఉందని జవాబు చెప్పారు. సుష్మ ట్వీట్పై చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీనిపై జోక్స్ చేస్తుండగా, మరికొందరేమో సీరియస్గా తీసుకుంటున్నారు. సుష్మాజీ తగిన సమాధానమిచ్చారని పలువురు కామెంట్ చేశారు. కొందరేమో ఆయన ప్రభుత్వ అడ్వైజరీ గురించి అడగడంలో తప్పేముందని, చాలా దేశాల్లో మార్గదర్శకాలు ఇస్తారని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
సుష్మా కౌంటర్ పైన స్పందన
విదేశాంగ శాఖను కొందరు ఎంక్వయిరీ విండోగా చూస్తున్నారని, సుష్మా స్వరాజ్ అలా ప్రతి దానికి స్పందిస్తున్నారని ఓ నెటిజన్ సుష్మా పైన ప్రశంసలు కురిపించారు. సుష్మా బ్రిలియంట్ సమాధనం చెప్పారని, రిక్టర్ స్కేల్ పైన ఇది 8గా నమోదవుతుందని మరొకరు అన్నారు. సుష్మ అద్భుతమైన సెన్సాప్ హ్యూమర్తో స్పందించారని, త్వరలో మంచి రెస్టారెంటు గురించి కూడా అడుగుతారేమోనని మరొకరు పేర్కొన్నారు.
ఆగిన విమానాలు
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలిలోని మౌంట్ అగుంగ్ అగ్నిపర్వతం జులై 3న బద్దలయింది. పెద్ద ఎత్తున లావా, పొగలు వెలువడ్డాయి. గత ఏడాది నుంచి పలుమార్లు ఈ అగ్నిపర్వతం బద్ధలైంది. అలాంటి ఘటనలు ఇంకా జరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తాజా పేలుడు కారణంగా బాలిలోని విమానాశ్రయం సహా మూడు విమానాశ్రయాలు మూతపడ్డాయి. వందలాది విమానాలు ఆగిపోగా, వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు.