మీరు వస్తేనే: పఠాన్కోట్ దాడిపై మోడీకి షిండే నిలదీత
న్యూఢిల్లీ: పఠాన్కోట్ తీవ్రవాద దాడి విషయమై కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే బుధవారం స్పందించారు. బిజెపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు తీవ్రవాద దాడులు ఎక్కువవుతాయని ఆరోపించారు.
పంజాబ్లోని పఠాన్కోట్ ఏరియల్ బేస్ పైన జరిగిన ఉగ్రదాడి ఘటనకు బాధ్యులు ఎవరో చెప్పాలని షిండే ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశారు. భద్రత వైఫల్యానికి కారణం చెప్పాలన్నారు. పఠాన్కోట్ ఘటనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దేశాన్ని కాపాడే పటిష్ఠమైన భద్రత వ్యవస్థ లేదని ఆరోపించారు.
1999లో విమానం హైజాక్కు గురైతే మన వాళ్లను విడిపించేందుకు తీవ్రవాదులను జైలు నుంచి విడిపించవలసి వచ్చిందన్నారు. అందులో మసూద్ అజహర్ కూడా ఉన్నారన్నారు. ఆ తర్వాత పలు సంఘటనలు జరిగాయన్నారు.
ఇప్పటికే పఠాన్కోట్ ఘటన నేపథ్యంలో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో నాలుగు రోజుల ఆపరేషన్ నిర్వహించి ఆరుగురు ఉగ్రవాదులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.