అసలు ఆ ప్రస్తావనేది... మోదీ స్పీచ్పై అసదుద్దీన్ ఓవైసీ విస్మయం...
ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఎక్కడా చైనా సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించకపోవడం పట్ల మజ్లిస్ అధినేత,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్మయం వ్యక్తం చేశారు. చైనా గురించి మాట్లాడుతాడని అనుకుంటే... ఆ విషయం వదిలేసి చనా(పప్పు ధాన్యాలు) గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు.రానున్నది పండుగల సీజన్ అని చెప్పిన మోదీ... ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్ గురించి తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.
ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్కు అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. కరోనా అనుమానిత కేసుల కోసం చార్మినార్ యునాని ఆస్పత్రిని సిద్దం చేయాలని... కింగ్ కోఠి ఆస్పత్రి తరహాలో దీన్ని కూడా వాడుకోవాలని సూచించారు. అక్కడ ఆక్సిజన్,వెంటిలేటర్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
కాగా,ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భారత్ మెరుగ్గా ఉందని.. సరైన సమయంలో లాక్డౌన్ విధించడంతో లక్షలాది మంది భారతీయుల ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నందునా... ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టంచేశారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు, నెలకు కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.