మోడీ-అమిత్ షా బారి నుంచి దేశాన్ని కాపాడండి, ప్రియాంక, రాహుల్ సావర్కార్ కాదు...గాంధీ
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా బారి నుంచి దేశాన్ని కాపాడాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. దాదాపు 15 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. అన్నదాతల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 'భారత్ బచావో' పేరుతో రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించింది.
చేసిందేమీ లేదు
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తర్వాత సభ వేదికపై ఆశీనులయ్యారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత సీఎంలు, పీసీసీ చీఫ్లు హాజరయ్యారు. తొలుత ప్రియాంకగాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.
సమస్యలు పట్టవు
దేశాభివృద్ధి పురోగమన దిశగా ఎందుకు పయనిస్తోందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. దేశం యువకులు, రైతులదని.. కానీ వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎకనామిక్ స్లో డౌన్ పేరుతో ఆటో మొబైల్ రంగం కుదలైందని చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. భేటీ పడావో, భేటీ పడావో అని ప్రధాని మోడీ అంటున్నారు.. కానీ చిన్నారులపై లైంగికదాడులు జరుగుతున్నాయని తెలిపారు.
ఉద్యోగాలేవీ
ఆర్థిక పరిస్థితి, పౌరసత్వ సవరణ బిల్లు, రైతుల సమస్యలు, ఉద్యోగాలపై ప్రశ్నిస్తున్నారు. ప్రజల సెంటిమెంట్తో సంబంధం లేకుండా మోడీ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆరేళ్లలో ఉద్యోగ కల్పన ఏదీ అని ఆమె ప్రశ్నించారు. జీఎస్టీ పన్నుతో వ్యాపారులు నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కితే కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. లక్షల మంది రైతుల ఆందోళనకు గురువుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రియాంకగాంధీ అభిప్రాయపడ్డారు.
రాహుల్ సావర్కార్ కాదు.. గాంధీ
తన పేరు రాహుల్ సావర్కార్ కాదని రాహుల్ గాంధీ అని రాహుల్ పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థను మోడీ కోలుకోలేని దెబ్బతీశారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చించలేరు కానీ.. తనను లోక్సభలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. మోడీ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఐసీయూకు చేరందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు.