ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రణాళిక ఎక్కడ: ట్వీట్ల ద్వారా నిప్పులు చెరిగిన చిదంబరం
ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహారు జైలు నుంచే ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టండంటూ ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం మంచి ప్రణాళికను తయారు చేయాల్సిందిగా చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి తనను కృంగదీస్తోందని చిదంబరం అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని దీనివల్ల నష్టపోయేది పేద మధ్య తరగతి ప్రజలే అని అన్నారు. ఈ దేశ ఆర్థికపరిస్థితిని చక్కబెట్టేందుకు తీసుకుంటున్న చర్యలేవి అని ప్రశ్నించారు.
I have asked my family to tweet on my behalf the following :-
— P. Chidambaram (@PChidambaram_IN) September 11, 2019
Thank you all for your support. I must say I am amazed by the capacity of the poor (who I have had the chance to meet and interact with over the last few days) to distinguish between justice and injustice.
ఇదిలా ఉంటే 73 ఏళ్ల చిదంబరంను 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీపై తీహార్ జైలుకు పంపిస్తూ ఢిల్లీ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీబీఐ విచారణలో 15 రోజులు గడిపిన తర్వాత బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ఇక అప్పటి నుంచి చిదంబరం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఏదో ఒక రకంగా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ట్విటర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నిస్తున్నందునే తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని చిదంబరం చెప్పారు. ఈ ట్వీట్లను తన కుటుంబ సభ్యుల ద్వారా చేయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 3వ తేదీన చిదంబరంను కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మన వృద్ధి రేటు 5శాతానికి పడిపోవడం పై చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. 5శాతం ఏంటని ప్రశ్నించిన చిదంబరం.. ఇప్పటి వరకు దేశ జీడీపీ 5శాతంగా ఉందని ఎవరికైనా గుర్తు ఉందా అని విమర్శించారు.