అవి ధరిస్తుంటే ఇంకా ఆర్థిక మాంద్యం ఎక్కడుంది: భలేగా చెప్పారు ఈ ఎంపీ
ఉత్తర్ ప్రదేశ్: అంతా చెబుతున్నట్లుగా దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోలేదని అన్నారు బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు కాలేదని చెప్పేందుకు ఆయన ఓక సూచికను తెరపైకి తీసుకొచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితి తిరోగమనం దిశగా పయనిస్తోందని ఎలా చెప్పగలరు అని ప్రశ్నించారు ఎంపీ వీరేంద్ర సింగ్. దేశంలో చాలామంది సూట్లు ధరిస్తున్నారని, జాకెట్లు ధరిస్తున్నారని చెప్పిన వీరేంద్ర సింగ్... సంప్రదాయ కుర్తా ధోవతీలు ఎవరూ ధరించడం లేదని చెప్పారు. మరి అలాంటప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి ఎక్కడ క్షీణించిందో చెప్పాలని వీరేంద్ర సింగ్ ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలు కాలేదని ఢంకా బజాయించి మరీ చెప్పారు.
ఢిల్లీలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక తిరోగమనం గురించి విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోందన్న వీరేందర్ సింగ్... నిజంగానే దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి ఉంటే తామంతా కుర్తాలు, ధోవతీలు ధరించి ఈ సమావేశానికి వచ్చేవారమని చెప్పారు. నిజంగానే దేశ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే మంచి బట్టలు, ప్యాంట్లు పైజామాలు ధరించేవారము కాదని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్లోని బలియా ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ వీరేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
BJP MP Virendra Singh Mast in Ballia: There have been discussions in Delhi & the world, about a recession. If there was any recession, we would have come here wearing 'kurta' & 'dhoti', not coats & jackets. If there was a recession we wouldn't have bought clothes, pants& pajamas. pic.twitter.com/5JdVPa9wRL
— ANI UP (@ANINewsUP) February 9, 2020
దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న సమయంలో వీరేందర్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. అంతకుముందు కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతింటోందన్న నివేదికలు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమల్లో వృద్ధి కనిపించడం లేదనేది అవాస్తవమని చెప్పిన వీరేందర్.. నిజంగానే ఆ సెక్టార్ దెబ్బతిని ఉంటే రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఎందుకవుతుందని ప్రశ్నించారు.
ఆటోమొబైల్ సేల్స్ నిజంగానే పడిపోయి ఉంటే రోడ్లపై ట్రాఫిక్ జామ్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు. కేవలం ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందనే వాతావరణంను సృష్టిస్తున్నారని వాస్తవానికి అలాంటిదేమీ జరగడం లేదని ఎంపీ వీరేంద్ర సింగ్ చెప్పారు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై నిందలేసేందుకే కొందరు ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని గతేడాది డిసెంబర్ 5న లోక్సభలో చెప్పారు వీరేంద్ర సింగ్
ఒక ఇంట్లో 20 వాహనాలు ఉంటాయని చెప్పిన వీరేంద్ర సింగ్.. వినియోగదారుడికి ఉత్పత్తికి ఏ రకంగా ముడిపెడుతారో స్పష్టత ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉంటే జనవరి 13న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 2019 నెలకు రిలైట్ ద్రవ్యోల్బణం 7.35 శాతంకు పెరిగింది. ఇది నవంబర్ నెలలో 5.54 శాతంగా ఉన్నింది. భారత దేశంలో ఇంకా రెసిషన్ అనేది రాలేదు. అయితే సాంకేతికంగా ఆర్థిక మందగమనంను తిరోగమనంగా చెబుతున్నాం. వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి క్షీణించినట్లు కనిపిస్తే ఆర్థిక క్షీణతను తిరోగమనంగా పిలుస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక తిరోగమనం వైపుగా దేశం వెళ్లలేదని అదేసమయంలో వెళ్లే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి.