కరోనా : భారత్కు ఏది బెస్ట్ వ్యాక్సిన్... ఏ వ్యాక్సిన్ ఇక్కడి కండిషన్స్కు బెటర్...
యావత్ ప్రపంచాన్ని ఆరోగ్య సంక్షోభంలో పడేసిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు ముందు నుంచి చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా శరవేగంగా పరిశోధనలు,ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి.
భారత్లోనూ ఆస్ట్రాజెనెకా,స్పుత్నిక్ వి,ఫైజర్,కోవ్యాగ్జిన్,నోవావ్యాక్స్ తదితర వ్యాక్సిన్లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఇందులో కొన్ని టీకాలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే వీటిలో ఏ టీకా భారత్లో కరోనాను సమర్థంగా నిరోధించగలదు... ఇక్కడి పరిస్థితులకు ఏ టీకా అయితే ప్రభావవంతంగా పనిచేయగలదు... అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్లు-కోవీషీల్డ్,నోవావ్యాక్స్...
సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రెండు కోవిడ్ 19 వ్యాక్సిన్ల ప్రయోగాలు చేపడుతోంది. అందులో ఒకటి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన కోవీషీల్డ్ కాగా మరొకటి నోవావ్యాక్స్. ఐసీఎంఆర్తో కలిసి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు వ్యాక్సిన్ల మూడో దశ ప్రయోగాలు చేపడుతోంది. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలపై ఐసీఎంఆర్ సంతృప్తి వ్యక్తం చేసింది.
అంతా సవ్యంగా సాగితే... ఈ ఏడాది చివరి నాటికి సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. 1 బిలియన్ వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తికై ఇప్పటికే ఆస్ట్రాజెనెకా సీరమ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే 2 బిలియన్ డోసుల నోవావ్యాక్స్ ఉత్పత్తి కోసం కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది.
కోవ్యాక్సిన్,కోవీషీల్డ్,నోవావ్యాక్స్ తయారీ ఇలా...
దేశీ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్ కూడా మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఈ దశలో మొత్తం 26వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరపనున్నారు. కోవిడ్ -19కు కారణమయ్యే SARS-CoV-2 క్రియా రహిత అణువుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్కి చెందిన ఓ కరోనా అసింప్టమాటిక్ పేషెంట్ నమూనాల నుంచి ఈ అణువును వేరు చేసి దాన్ని వ్యాక్సిన్ తయారీ కోసం వాడుతున్నారు.
నోవావ్యాక్స్,కోవిషీల్డ్ల వ్యాక్సిన్ తయారీ దీనికి భిన్నంగా ఉంది. నోవావ్యాక్స్ కోసం కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ల నుంచి హానీ చేయని పదార్థాన్ని సేకరించి... దాన్ని సూక్ష్మ కణాలుగా అభివృద్ది చేస్తారు. కోవీషీల్డ్ను సాధారణ జలుబు వైరస్,అడెనోవైరస్ అణువు ద్వారా అభివృద్ది చేస్తున్నారు.
జైదుస్ క్యాడిలాను ఇలా అభివృద్ది చేస్తున్నారు...
దేశీయంగా అభివృద్ది జరుగుతోన్న మరో కరోనా వ్యాక్సిన్ జైదుస్ క్యాడిలా. ఒకే డీఎన్ఏ ఆధారిత సాంకేతికతతో ఈ వ్యాక్సిన్ను అభివృద్ది చేస్తున్నారు. ఇదే సాంకేతికతను గతంలో హెపటైటిస్ సీ కోసం కూడా ఉపయోగించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు డిసెంబర్లో జరగనున్నాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాతే జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్ వచ్చే సూచనలున్నాయి. ఇక రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి మూడో దశ ప్రయోగాలు హైదరాబాద్లోని డా.రెడ్డీస్ ల్యాబోరేటరీలో జరుగుతున్నాయి.
కాంప్లెక్స్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్ను తయారుచేశారు. అంటే,కణజాలాల్లో రోగనిరోధకతను ఉత్తేజితం చేసేందుకు మరో వైరస్ ద్వారా డీఎన్ఏ కోడ్ను శరీరంలోకి ప్రవేశపెడుతారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు త్వరలోనే పూర్తి కానున్నాయి.
ఫైజర్,మోడెర్నా కోసం ఆ టెక్నాలజీ
ఫైజర్,మోడెర్నా వ్యాక్సిన్స్ కూడా కరోనాపై పోరులో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. mRNA టెక్నాలజీ ఆధారంగా ఈ రెండింటిని అభివృద్ది చేస్తున్నారు. ఈ విధానంలో శరీర రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసేందుకు సింథటిక్ జన్యు పదార్థాన్ని వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. ఇప్పటివరకూ జరిపిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్లు 95శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలిందని ఆ కంపెనీలు వెల్లడించాయి.
భారత్కు ఏ వ్యాక్సిన్ బెటర్...
భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాక్సిన్తో పాటు సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగాలు జరుపుతున్న నోవావ్యాక్స్,కోవీషీల్డ్లు భారత్ పరిస్థితులకు సరిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ మూడు వ్యాక్సిన్ల డోసులను 2-8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. ఒకరకంగా పోలింగ్ వ్యాక్సిన్ను భద్రపరిచేందుకు అవసరమయ్యే ఉష్ణోగ్రతకు ఇది సమానమనే చెప్పాలి. రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డోసులను భద్రపరచాలంటే మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. దీన్ని పేషెంట్లకు ఇంజెక్ట్ చేసే ముందు ఒక ద్రవాన్ని కూడా చేర్చాల్సి ఉంటుంది.
Recommended Video
మోడెర్నా,ఫైజర్లను నిల్వ చేయాలంటే...
మోడెర్నా,ఫైజర్ వ్యాక్సిన్ల డోసులను ఒకే ఉష్ణోగ్రతలో 30 రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయలేం. దానికి కూడా మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం.భారత్లో ఉన్న రవాణా మౌలిక సదుపాయాలు,వ్యాక్సిన్ డోసులను భద్రపరిచేందుకు కావాల్సిన సదుపాయాల రీత్యా... ఈ రెండింటిని మారుమూల గ్రామాల వరకు చేర్చడం ఒకింత ఇబ్బందితో కూడుకున్నది. పైగా ఈ రెండు కంపెనీలు ఇప్పటివరకూ భారత్లో ఏ కంపెనీతోనై టైఅప్ అవలేదు.