‘మధుర తగలబడిపోతుంటే! హేమమాలిని షూటింగ్ ఫొటోలా!’
మధుర: ఉత్తరప్రదేశ్లోని మధురలో భూ దురాక్రమణల తొలగింపు సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లలో ఆ నగరం తగలబడిపోతోంది. నిరసనకారులు, పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో మధుర సిటీ ఎస్పీ ముకుల్ ద్వివేదీతో పాటు ఓ ఎస్ఐ స్థాయి అధికారి కూడా చనిపోయిన సంగతి తెలిసిందే.
వీరితో పాటు మరో 24 మంది కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మధుర పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రముఖ సినీ నటి హేమామాలిని ఈ విషయం తెలిసిందే లేదో గానీ, ఆమె చేసిన పనిపై మాత్రం నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న తన ఫొటోలను హేమామాలిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ మేరకు న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగడంతో వెనువెంటనే మేల్కొన్న హేమామాలిని సదరు ఫొటోలను తొలగించారు.
అనంతరం సంయమనం పాటించాలని తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, అల్లర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు.