జనారణ్యంలోకి అరుదైన శ్వేతనాగు.. చూసేందుకు ఎగబడ్డ స్థానికులు
బెంగళూరు/కడలూరు : నాగుపాముల్లో రకరకాలు ఉంటాయి. నల్ల త్రాచు, శ్వేత నాగు అని ఉంటాయని పెద్దలు చెప్తుంటారు. సాధారణ నాగుపాములో కన్నా నల్ల త్రాచులో విషం ఎక్కువే. ఇక శ్వేతనాగులో మరింత ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జనారణ్యంలో నాగుపాములు కనిపిస్తాయి. కానీ నల్లత్రాచు, శ్వేతనాగులు మాత్రం దట్టమైన అడవీలో మాత్రమే ఉంటాయి. ఇవీ అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తే మాత్రం చూసేందుకు జనం ఎగబడుతారు.
కర్ణాటకలోని కడలూరులో అరుదైన శ్వేతనాగు కనిపించింది. ధవళ వర్ణంతో మెరుస్తోన్న నాగును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ శ్వేతనాగును కెమెరాల్లో బంధించేందుకు ఆరాటపడ్డారు. అయితే చుట్టూ జనం గుమిగూడటంతో శ్వేతనాగు తొలుత కాస్త బెదిరిపోయింది. ఇలా అయితే లాభం లేదనుకుందే ఏమో .. తప్పించుకునేందుకు తన ప్రయత్నం చేసింది. ఒక్కసారిగా బుసలు కొట్టింది.
దీంతో అక్కడున్న జనం బెంబేలెత్తిపోయారు. పడగ విప్పి కోపాన్ని ప్రదర్శించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వారిలో ఒకరు మాత్రం కాస్త ధైర్యం చేశారు. ఆ శ్వేతనాగును చాకచక్యంగా పట్టుకున్నారు. తర్వాత దానిని తీసుకెళ్లి అడవీలో వదిలివేశారు. కానీ ఆ శ్వేత నాగును చూసేందుకు మాత్రం జనం ఎగబడ్డారు. ఫోటోలు తీసుకొని సంబరపడిపోయారు. ఇది అత్యంత అరుదైన శ్వేత నాగు అని వృద్ధులు చెప్తున్నారు.