మీరెవరు?: రజినీకి స్టెరిలైట్ బాధితుడి షాక్, నవ్వేశారు! ఆర్థిక సాయం ప్రకటన
చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే దేశంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి ఏమీ కాదు. కానీ, ఆయన ఎవరో తెలియని వారు తమిళనాడులోనే ఉండటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేసే అంశంగా మారింది.
స్టెరిలైట్ రాగి కార్మాగారన్ని మూసివేయాలని ఆందోళన వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో 13మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 30మందికిపైగా ఈ కాల్పుల్లో గాయాలపాలయ్యారు.
రజినీని ఎవరు? అంటూ..
కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు రజినీకాంత్ బుధవారం తూత్తుకుడికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రజినీకాంత్ వరుసగా పరామర్శించుకుంటూ వెళ్తున్నారు. సంతోష్ రాజ్ అనే బాధితుడిని రజినీ పరామర్శిస్తుండగా.. ‘మీరెవరు?' అని అతడు అగడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, రజినీ మాత్రం నవ్వి వెళ్లిపోయారు.
రజినీనే కాదు..
అయితే, రజినీనే కాదు తమను పరామర్శించడానికి వచ్చిన వీఐపీలందర్నీ బాధితులు ఇలాగే ప్రశ్నిస్తూ అవమానిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతుండటం గమనార్హం. అయితే, అందరి విషయంలోలానే రజినీ విషయంలో కూడా జరగడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘నాన్ రజినీకాంత్' అనే హ్యాష్ట్యాగ్ కాసేపు ట్రిండింగ్ కూడా అయ్యింది.
వింత ప్రశ్నలు..
కాగా, 21ఏళ్ల సంతోష్ బీకాం చదువుతున్నాడు. స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇటీవల పరామర్శించేందుకు వచ్చిన ఓ మంత్రిని కూడా సంతోష్.. వింత ప్రశ్నలు అడిగాడట. దీంతో మంత్రి గందరగోళానికి గురయ్యారట. దీంతో మంత్రితోపాటు వచ్చిన వారు సంతోష్పై మండిపడ్డారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురుకావడం గమనార్హం.
స్టెరిలైట్ తెరిచే ప్రయత్నం వద్దు
తూత్తుకుడి బాధితులను పరామర్శించిన అనంతరం రజినీకాంత్ మాట్లాడుతూ.. తూత్తుకుడి ఘటనలో ప్రభుత్వ వైఫల్యం ఉందని అన్నారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మరోసారి తెరిచే ప్రయత్నం చేయవద్దని డిమాండ్ చేశారు. కాల్పుల ఘటనపై మానవ హక్కుల సంఘం విచారణ జరపాలని కోరారు.
బాధితులకు రజినీ సాయం
తూత్తుకుడి ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని రజినీ డిమాండ్ చేశారు. తూత్తుకుడి ఘటన వెనుక ప్రేరేపిత శక్తుల హస్తం ఉందని అన్నారు. తూత్తుకుడి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.10వేలు పరిహారం ప్రకటించారు రజినీకాంత్.