కరోనా : కొత్త వేరియంట్తో ప్రపంచానికే ముప్పు... డబ్ల్యూహెచ్ఓ సంచలన స్టేట్మెంట్...
భారత్లో సెకండ్ వేవ్ ఉధృతి యావత్ ప్రపంచాన్నే భయాందోళనకు గురిచేస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న వైరస్ నిత్యం వేలాది మందిని బలితీసుకుంటోంది. నిజానికి కొత్త వేరియంట్ చెందిన వైరసే ఈ స్థాయి వ్యాప్తికి కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతేడాది అక్టోబర్లో భారత్లో గుర్తించిన కరోనా వేరియంట్ B.1.617 ఒరిజినల్ కరోనా కంటే వేగంగా,అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్నట్లు తాజాగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ప్రపంచానికే ప్రమాదకరం : డబ్ల్యూహెచ్ఓ
'మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్లో B.1.617 కరోనా వేరియంట్ వ్యాప్తి పెరిగింది. యావత్ ప్రపంచానికే దీనివల్ల ముప్పు పొంచి ఉన్నది. కాబట్టి అంతర్జాతీయంగా దీన్ని ప్రమాదకర వేరియంట్గా పరిగణిస్తున్నాం. ట్రిపుల్ మ్యుటెంట్ అయిన ఈ వైరస్ను అంతర్జాతీయంగా ఆందోళనకర వేరియంట్గా వర్గీకరిస్తున్నాం.' అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి వాన్ కెర్కోవ్ తెలిపారు. B.1.617 వేరియంట్పై మరింత సమాచారం,సీక్వెన్సింగ్ అవసరం ఉందని పేర్కొన్నారు.
స్వల్ప మార్పులతో మ్యుటెంట్...
ప్రపంచవ్యాప్తంగా B.1.617 వేరియంట్ సహా మొత్తం 10 కరోనా వేరియంట్ల వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ గత వారం వెల్లడించింది. గత నెల రోజులుగా పైగా దేశంలో విపరీతంగా పెరుగుతున్న కేసులకు ఈ వేరియంటే కారణమని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. B.1.617 వేరియంట్ నుంచి స్వల్ప మార్పులతో పలు ఉపశాఖలు కూడా పుట్టుకొచ్చి ఉంటాయని... ఇవన్నీ కలిసి వైరస్ వ్యాప్తిని పెంచాయని భావిస్తోంది.
ఆ జాబితాలో కొత్త వేరియంట్
గతంలో బ్రిటన్,బ్రెజిల్,సౌతాఫ్రికాలో గుర్తించిన కరోనా వేరియంట్స్ను ఆందోళనకర వైరస్ల జాబితాలో డబ్ల్యూహెచ్ఓ చేర్చింది. తాజాగా ఆ జాబితాలో కొత్త వేరియంట్ కూడా చేరింది. ఈ వేరియంట్స్ ఒరిజినల్ వైరస్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు దానికంటే ప్రాణాంతకమైనవిగా పేర్కొంటున్నారు. అయితే ఒరిజినల్ వైరస్కు ఏవిధంగానైతే చికిత్స అందిస్తున్నామో దీనికి అదే పద్దతిని అనుసరించాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఇప్పుడున్న టెస్టింగ్ పద్దతులు,వ్యాక్సిన్ వీటిపై పనిచేయవని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు.
కాగా,భారత్లో సోమవారం(మే 10) 3,70,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మరో 3700 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటికే ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోయాయి. వ్యాక్సిన్ కొరత,ఆక్సిజన్ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అధికారిక వెల్లడిస్తున్న మరణాల కంటే అసలు మరణాల లెక్కలు చాలా ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.